ఆన్లైన్ దందా: బ్యాంకు ఖాతాలే టార్గెట్, ఏ సమాచారమైనా రూ.500కే!
భారతీయుల బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఆన్లైన్లో విక్రయిస్తున్న ముఠా దందాను మధ్య ప్రదేశ్ పోలీసులు బయటపెట్టారు.
భోపాల్: భారతీయుల బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఆన్లైన్లో విక్రయిస్తున్న ముఠా దందాను మధ్య ప్రదేశ్ పోలీసులు బయటపెట్టారు. లాహోర్ కేంద్రంగా ఓ పాకిస్తానీ ఈ నెట్ వర్క్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దందాకు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు చెందిన ఓ టెక్కీతో పాటు హెచ్డీఎఫ్సి బ్యాంకుకు చెందిన ఉన్నతోద్యోగి సహకరిస్తున్నట్లుగా నిర్దారించారు. కేవలం రూ.500కే ఈ ముఠా భారతీయుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
బ్యాంకు ఖాతా సంఖ్య, ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలన్నీ ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు మధ్యప్రదేశ్ సైబర్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు.. కస్టమర్ రూపంలో ముఠాను సంప్రదించి దందాను బయటపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
కస్టమర్గా వాళ్లను సంప్రదించిన సైబర్ సెల్ పోలీసులు.. ఇండోర్కు చెందిన మహిళ డెబిట్ కార్డు వివరాలను కోరారు. దానికి బదులుగా బిట్ కాయిన్స్ ఇస్తామని ఆఫర్ చేశారు. దీంతో ఇద్దరు ముఠా సభ్యులు వీరి ట్రాప్ లో పడ్డారు. చాకచక్యంగా వారిని ముంబైలో అరెస్ట్ చేశారు.
ఆగస్టు 28న జైకిషన్ గుప్తా అనే వ్యక్తి తన డెబిట్ కార్డు నుంచి రూ. 72,401 పోయాయని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపడుతున్న పోలీసులకు ఈ దందా గురించి తెలిసింది. అతని డెబిట్ కార్డుతో ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లపై విమానం టికెట్లు కూడా కొన్నారని, కేసు చేధించడంలో ఆ సమాచారం కీలకంగా మారిందని చెప్పారు.