ఈ నకిలీ ముస్లింలతోనే దేశానికి ప్రమాదం, జాగ్రత్త: సాక్షి
మీరట్: దేశంలోని ముస్లింలు అంతా మంచి వారేనని భారతీయ జనతా పార్టీ ఎంపి సాక్షి మహారాజ్ అన్నారు. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్, పశ్చిమబెంగాల్ సీఎం, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ లాంటి నకిలీ ముస్లింల వల్లే దేశానికి ముప్పు అని అన్నారు.
మీరట్లో జరిగిన మూడో సంత్ సమాగమ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలంతా భారత్ దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటారని చెప్పారు. ప్రపంచంలో వారికి సురక్షిత ప్రాంతం అనేది ఉందంటే.. అది భారతదేశమేనని అన్నారు.
నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న అభివృద్ధి పథకాల ఫలాలన్నీ ఎక్కువగా వారికే అందుతున్నాయని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు, విధానాల్ని చూసి ప్రతిపక్షాలన్నీ భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
దేశంలో సహన శీలత తగ్గిపోతోందంటూ రాద్ధాంతం చేసిన నితీశ్, కేజ్రీవాల్లు బీహార్ ఎన్నికల తరువాత దాని మాట ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని దేశంలోని ప్రజలంతా కోరుకుంటున్నారని దానిలో వివాదం ఏముందని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వంగా మారిపోయిందని మండిపడ్డారు. కమలేష్ తివారీ అనే ఓ హిందూ నేతను మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడారని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన యూపీ ప్రభుత్వం.. తివారీ తల నరికిన వారికి రూ. 51లక్షలు ఇస్తామని ప్రకటించిన కొందరు ముస్లిం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
భారతదేశంలోని ప్రతీ ముస్లీం కూడా హిందువేనని, వారి డిఎన్ఏలోనే హిందూ మతం ఉందని సాక్షి మహారాజ్ అన్నారు. డిఎన్ఏ పరీక్ష చేస్తే అది తెలుస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గోవధను నిషేధించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.