సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు విశ్వసించొద్దు: ఈశాన్య ప్రజలకు భారత ఆర్మీ సూచన
పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చడంతో ఈశాన్య భారతం అట్టుడుకుతోంది. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ మిన్నంటుతోంది. గువాహటి, మేఘాలయాలో 144 సెక్షన్ విధించి, భారీ భద్రతను మొహరించారు. కానీ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేసి రెచ్చిపోయే ప్రమాదం ఉందని భారత ఆర్మీ భావించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తప్పుడు వార్తలను విశ్వసించొద్దని కోరింది. కొందరు కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
కొందరు వ్యక్తులు, లేదంటే వ్యక్తుల సమూహం తప్పుడు కథనాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంటారని చెప్పారు. దీంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఏదేని సంబద్ధ వార్తను, కథనాలను విశ్వసించొద్దని కోరారు. గువహటిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కానీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ తీసివేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం పోలీసులు జరిపిప కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే.
పౌరసత్వ సవరణ సెగలతో అసోం అట్టుడుకుతోంది. సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోమని ఆందోళన కారులు నిరసన బాటపట్టారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. అసోం రాజధాని గువహటి నిరసనలతో హోరెత్తుతుంది. దీంతో జపాన్ ప్రధాని షింజో అబే తన పర్యటనను రద్దుచేసుకున్నారు. ఆదివారం నుంచి మూడురోజులపాటు భారతదేశంలో షింజో అబే పర్యటించాల్సి ఉంది. కానీ నిరసనల నేపథ్యంలో టూర్ వాయిదా వేసుకున్నారు.