విధానసౌదలో ప్రమాణస్వీకారం: చరిత్ర రిపీట్ అవుతుందా?.. లేక కుమారస్వామి బ్రేక్ చేస్తారా?
Recommended Video
బెంగళూరు: సీట్ల పరంగా మూడో స్థానంలో నిలిచినప్పటికీ.. మారిన రాజకీయ సమీకరణాల రీత్యా సీఎం సీటు మాత్రం జేడీఎస్ ను వరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారను.
సాయంత్రం 4.30 గంటలకు విధానసౌధ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే విధానసౌధలో ప్రమాణస్వీకారం చేసిన ఏ సీఎం కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదన్న ఆసక్తికర కథనం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది.
కర్ణాటక చరిత్రలో దేవ్ రాజ్, సిద్దరామయ్య మాత్రమే పూర్తి కాలం పాటు సీఎం పదవిలో కొనసాగారు. వీరిలో దేవ్ రాజ్ రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయగా.. సిద్దరామయ్య కంఠీరవ మైదానంలో ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలకు అంత హంగు ఆర్భాటాలేవి ఉండకపోయేది. రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో సాదాసీదాగా ప్రమాణస్వీకారం పూర్తయ్యేది. 1983నుంచే విధానసౌదలో ప్రమాణస్వీకారం చేసే ఆనవాయితీకి తెరలేచింది. అప్పట్లో జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్దే తొలిసారిగా విధానసౌదలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే సంవత్సరం కూడా ఆయన ఆ పదవిలో కొనసాగలేకపోయారు. మద్యం కాంట్రాక్టులకు సంబంధించి ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు రావడం.. హైకోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించడంతో.. ఆయన రాజీనామా చేయక తప్పలేదు. ఆ తర్వాత మరోసారి 1983లో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కారణంగా పదవికి దూరం కావాల్సి వచ్చింది.
ఇక 1990లో, విధానసౌదలో ప్రమాణస్వీకారం చేసిన బంగారప్ప కూడా పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగలేదు. కావేరి జలవివాదం నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర అల్లర్లు రేకెత్తడంతో... పరిస్థితిని చక్కదిద్దడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో రెండేళ్ల తర్వాత వీరప్ప మొయిలీతో కాంగ్రెస్ ఆయన స్థానాన్ని భర్తీ చేసింది.
ఇక ఆయన తర్వాత విధానసౌదలో ప్రమాణస్వీకారం చేసిన మరో వ్యక్తి ఎస్ఎం కృష్ణ. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కారణంగా ఆయన కూడా పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగలేదు.
2004లో సీఎం అయిన కాంగ్రెస్ నేత ధరమ్ సింగ్ కూడా రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. జేడీఎస్ కుమారస్వామి తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోక తప్పలేదు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో కుమారస్వామి విధానసౌదలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే బీజేపీతో సీఎం సీటును పంచుకునే ఒప్పందంలో భాగంగా.. 20నెలలకు కుమారస్వామి ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత యడ్యూరప్ప సీఎంగా ఆయన స్థానాన్ని భర్తీ చేసినప్పటికీ.. కుమారస్వామి తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలం ఏడు రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.
ఆ తర్వాత 2008లో బీజేపీ గెలవడంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. విధానసౌదలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో మూడేళ్లకే పదవి నుంచి తప్పుకున్నారు.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో 'విధానసౌద' సెంటిమెంట్ పై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే కుమారస్వామి ఆ సెంటిమెంటును బ్రేక్ చేసి ఐదేళ్లు పదవిలో కొనసాగుతారా?.. లేక చరిత్ర రిపీట్ అవుతుందా అన్నది వేచి చూడాలి.