భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్, ఆటోల్లో డబుల్ చార్జ్, లూటీ !
Recommended Video
బెంగళూరు: పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ ప్రభావం కర్ణాటకతో పాటు బెంగళూరు నగర ప్రజలపై పడింది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్ టీసీ), బీఎంటీసీ (బెంగళూరు సిటీ బస్సులు) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బెంగళూరు నగరంలో క్యాబ్ సర్వీసులు నిలిచిపోవడంతో కొందరు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల దగ్గర డబుల్ చార్జీలు వసూలు చేసి లూటీ చేశారు.
భారత్ బంద్: బీజేపీ కంచుకోట, ఎమ్మెల్యేకి సెగ, పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లు, కమిషనర్!
బెంగళూరు నగరంలో అక్కడక్కడ ఆటోలు మాత్రం సంచరించాయి. భారత్ బంద్ కు బెంగళూరు నగరంలోని ఓలా, ఉబర్ క్యాబ్ ల డ్రైవర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిత్యం క్యాబ్ ల్లో సంచరించే ఐటీ, బీటీ సంస్థల ఉద్యోగులు క్యాబ్ లు అందుభాటులో లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు బెంగళూరు నగరంలోని అనేక సంఘ, సంస్థలు మద్దతు ప్రకటించాయి. నమ్మ మెట్రో రైలు మాత్రం ఎలాంటి అటంకాలు లేకుండా సంచరించింది.
ఓలా క్యాబ్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పాష, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ భారత్ బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించామని, మా సంస్థలకు చెందిన క్యాబ్ లు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు సంచరించవని చెప్పారు.
బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ దగ్గర జరిగిన ధర్నాలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు పాల్గోని కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరు టూరిస్టు ట్యాక్సీ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాక్రిష్ణ హోల్ల మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం రవాణా సంస్థ మీద పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.