Bharat Bandh: రైతు దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ అధినేత్రి సంచలనం: ఎవరూ అందులో పాల్గొనవద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేకించి- వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు రోజుల తరబడి దేశ రాజధాని శివార్లలో నిరసన దీక్షలకు కూర్చున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. రైతుల సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నిర్వహిస్తోన్న చర్చలు మాత్రం కొలిక్కి రావట్లేదు. ఇప్పటికే ఎనిమిది దఫాలుగా కేంద్ర మంత్రులు-రైతు సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాయి.
తాము చేసిన కీలక సూచలనకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించకపోవడం వల్లే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడుతోందని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ.. మరింత ఒత్తిడిని తీసుకుని రావడానికి భారత్ బంద్ను తలపెట్టారు. ఈ బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదనే ఉద్దేశంతోనే పరిమితంగా బంద్కు పిలుపునిచ్చినట్లు రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు స్పష్టం చేశారు.
రైతుల నిరసన ఉద్యమం, వారు తలపెట్టిన భారత్ బంద్కు బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. బీజేపీయేత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కూడా బంద్కు మద్దతు ఇచ్చినట్లు ఇదివరకే ప్రకటించాయి. తాజాగా రైతుల దీక్షకు మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలను దూరంగా ఉంటానని వెల్లడించారు. డిసెంబర్ 9.. సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, గానీ కార్యకర్తలు గానీ జన్మదిన వేడుకలను జరుపుకోవద్దని ఆమె సూచించారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోండటం, అన్నం పెట్టే రైతులు రోడ్ల మీదికి వచ్చి సుదీర్ఘ కాలం పాటు నిరసన దీక్షలను చేపట్టడం వంటి పరిణామాల మధ్య తాను పుట్టినరోజు వేడుకలను జరుపుకోలేనని తెలిపారు. రైతులకు సంఘీభావంగా తాను ఈ వేడుకలకు దూరంగా ఉండబోతోన్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తన జన్మదిన వేడుకలను నిర్వహించొద్దని, రైతుల మద్దతుగా పోరాడాలని సోనియాగాంధీ సూచించారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం.. వారిని రోడ్ల పాలు చేసిందని మండిపడ్డారు.