రోడ్ల దిగ్బంధనం.. రైల్ రోకో.. వేలాదిగా పోటెత్తిన రైతులు... 'భారత్ బంద్' ఇలా జరిగింది...
భారత్ బంద్లో భాగంగా రైతు నిరసనలు,నినాదాలతో ఉత్తరాది రాష్ట్రాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్కు మంచి స్పందన లభించింది. వేలాది సంఖ్యలో రైతులు రోడ్డు పైకి వచ్చి కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించారు. కేంద్రం తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Recommended Video
పంజాబ్లో బంద్ సక్సెస్...
పంజాబ్లో అధికార పార్టీ కాంగ్రెస్,విపక్ష పార్టీలు శిరోమణి అకాళీదల్,ఆమ్ ఆద్మీ పార్టీలు భారత్ బంద్కు మద్దతునివ్వడంతో భారీ స్పందన లభించింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు సైతం తమ షాపులను మూసివేశారు. కూరగాయాల మార్కెట్లు కూడా మూతపడ్డాయి. చాలాచోట్ల రైతులు రైల్వే పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెప్సు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ బస్సులు కూడా నిలిచిపోయాయి. రైల్ రోకోను సెప్టెంబర్ 29 వరకూ పొడగిస్తున్నట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్షణ్ కమిటీ ప్రకటించింది.
ట్రాక్టర్ నడిపిన సుఖ్బీర్ సింగ్...
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్... దేశానికి రైతులే వెన్నెముక అని... కేంద్రం తాజా నిర్ణయం వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. కేంద్రం ఈ బిల్లులను వెనక్కి తీసుకునేంతవరకూ కలిసికట్టుగా పోరాడుదామని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా శిరోమణి అకాళీదల్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్రాక్టర్ మార్చ్ చేపట్టారు. ఇటీవలే తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన తన సతీమణి హర్సిమ్రత్ కౌర్ని పక్కనే కూర్చొబెట్టుకుని ట్రాక్టర్ నడిపారు. ముక్త్సర్ జిల్లా బాదల్లోని తన ఇంటి నుంచి లంబీ గ్రామం వరకూ ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లిన ఆయన... అక్కడ రైతు నిరసనల్లో పాల్గొన్నారు. పంజాబ్ సింగర్స్ హర్భజన్ మన్,రంజిత్ బవా తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు.
హర్యానా,యూపీల్లోనూ భారీ స్పందన
పంజాబ్ పొరుగునే ఉన్న హర్యానాలోనూ బంద్కు భారీ స్పందన లభించింది. వేలాది మంది రైతులు కర్నాల్-మీరట్,రోహ్తక్-జజ్జర్,ఢిల్లీ-హిసార్ రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. ఈ క్రమంలో పలు చోట్ల రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా అంబాలా,పానిపట్ రైల్వే స్టేషన్లలో ప్రభుత్వం భారీ ఎత్తున అదనపు బలగాలను మోహరించింది. ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ ఖేరీ,ఫిలిబిత్,సంబల్,బాఘ్పాట్,బర్బంకి తదిరత ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్-ఢిల్లీ బోర్డర్ను దిగ్బంధించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
మహారాష్ట్ర,బిహార్,పశ్చిమ బెంగాల్....
మహారాష్ట్రలో ముంబై,థానే,జల్నా,నాందేడ్ తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బిహార్లో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ దాదాపు 50 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ఇక పశ్చిమ బెంగాల్లో సీపీఐ(ఎం) అనుబంధ విభాగం సారా భారత్ క్రిషక్ సభ,తృణమూల్ కాంగ్రెస్ అనుబంధ విభాగం కిసాన్ ఖేత్ మజ్దూర్ కార్యకర్తలు చాలాచోట్ల నిరసనలు చేపట్టారు. హూగ్లీ,ముర్షీదాబాద్,నార్త్ 24 పర్గనాస్,బంకురా,నదియా తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
దక్షిణాదిలో ఇలా....
దక్షిణాదిలో కర్ణాటక,తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో రైతు నిరసనలు జరిగాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో చాలామంది రైతులు రోడ్డెక్కి నిరసనల్లో పాల్గొన్నారు. అయితే స్థానిక రైతు సంఘాల మధ్య తలెత్తిన విబేధాలతో ఆశించినంత స్పందన రాలేదు. మాజీ రైతు సంఘం నేత కొడిహళ్లి చంద్రశేఖర్ భారత్ బంద్లో తాము పాల్గొనట్లేదని ప్రకటించారు.తమిళనాడులో రైతు సంఘం అధ్యక్షుడు పి అయ్యకన్ను ఆధ్వర్యంలో పలుచోట్ల రైతులు నిరసనలు చేపట్టారు. చేతిలో పుర్రెలు పట్టుకుని తిరుచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అగ్రి బిల్లులపై సంతకం చేయవద్దని డిమాండ్ చేశారు. ఇక కేరళలోనూ పలుచోట్ల రైతులు నిరసనలు చేపట్టారు.