నేడు భారత్ బంద్... ఏయే రాష్ట్రాల్లో రైతు నిరసనలు... దక్షిణాది పరిస్థితేంటి...
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 'భారత్ బంద్' జరగనుంది. బంద్లో భాగంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల హైవేలు,రైల్వే ట్రాక్స్ను రైతులు దిగ్బంధించే అవకాశం ఉంది. ఢిల్లీకి పొరుగునే ఉన్న హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు దేశ రాజధానికి వెళ్లే మార్గాలను దిగ్బంధించే అవకాశం ఉంది. నిన్న మొన్నటివరకూ వేర్వేరుగా జరిగిన రైతు నిరసన కార్యక్రమాలు 'భారత్ బంద్'తో ఉమ్మడి కార్యాచరణ రూపం తీసుకోనున్నాయి.
వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల పోరు .. సెప్టెంబర్ 25న భారత్ బంద్ .. వివిధ రాష్ట్రాల్లో ఇలా !!
18 విపక్ష పార్టీల మద్దతు...
గత కొద్దిరోజులుగా హర్యానా,పంజాబ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆయా రైతు సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా జరిగిన నిరసన కార్యక్రమాలు ఇప్పుడు ఏక తాటిపైకి రానున్నాయి. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్(BKU) అఖిల భారత రైతు సంఘం(AIFU), ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(AIKSCC),ఆల్ ఇండియా కిసాన్ మహాసంఘ్(AIKM)లు సెప్టెంబర్ 25న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు దాదాపు 18 విపక్ష పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. మద్దతు ప్రకటించిన పార్టీల్లో కాంగ్రెస్,సమాజ్వాదీ,బహుజన్ సమాజ్ పార్టీ,తృణమూల్ కాంగ్రెస్,డీఎంకె,టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. అలాగే సీఐటీయూ,ఏఐటీయూసీ,హింద్ మజ్దూర్ సభ సహా 10 ట్రేడ్ యూనియన్స్ రైతు నిరసనలకు సంఘీభావం ప్రకటించాయి.
పంజాబ్లో ఇలా నిరసనలు...
భారత్ బంద్లో భాగంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (KMSC) పంజాబ్లో రైల్ రోకోకి పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు ఇవ్వకూడదని... శాంతియుత పద్దతిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రైతులు తమ నిరసన తెలియజేయాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతీ ఒక్కరూ కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాలన్నారు. సెక్షన్ 144 అమలులో ఉన్నా... ఎవరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడవన్నారు.ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ నేడు 'చక్క జామ్'(రోడ్ బంద్)కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల పాటు అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధించనున్నారు.
ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్....
ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ,విపక్ష పార్టీ కాంగ్రెస్లు బంద్కు మద్దతు తెలిపాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ బోర్డర్లో నిరసనలకు పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని రైతులంతా నిరసనలతో తమ గ్రామాలను,హైవేలను దిగ్బంధించాలని బీకేయూ పిలుపునిచ్చింది. రైతులకు సంఘీభావంగా స్థానిక షాపుల యజమానులు కూడా శుక్రవారం(సెప్టెంబర్ 25) బంద్ పాటించనున్నారు. దాదాపు 3లక్షల మంది సభ్యులను కలిగిన ఏఐకేఎస్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో నూ పెద్ద ఎత్తున నిరసనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఏఐకెఎస్ నిరసనలు చేపట్టే అవకాశం ఉంది.వామపక్ష అనుబంధ ఆల్ ఇండియా కిసాన్ సభ(AIKS) ఆధ్వర్యంలో బెంగాల్లో రహదారుల దిగ్బంధనం జరగనుంది. పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి,పలు రైతు సంఘాలు,షేర్ క్రాపర్స్ ఇప్పటికే బంద్కు మద్దతు ప్రకటించాయి.
దక్షిణాదిలో ఆ 3 రాష్ట్రాల్లో...
దక్షిణాదిలో కర్ణాటక,తమిళనాడు,కేరళలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కేరళలో సంయుక్త కర్షక సమితి(SKS) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. దాదాపు 250 చోట్ల నిరసనలు జరిగే అవకాశం ఉంది. తమిళనాడు,కర్ణాటకల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరగవచ్చు. కర్ణాటకలోని ఓలా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్,లారీ డ్రైవర్స్ అసోసియేషన్ రైతులకు సంఘీభావంగా బంద్లో పాల్గొనున్నాయి. శుక్రవారం తమ క్యాబ్ సర్వీసులు,లారీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
Recommended Video
ఎందుకీ వివాదం...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020,ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ),నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020 ఇటీవల ఉభయ సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం పొందగానే ఇవి చట్టరూపం దాల్చనున్నాయి. ఈ బిల్లులు రైతులకు డెత్ వారెంట్ లాంటివేనని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... రైతులకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం చెబుతోంది. ఈ బిల్లు రైతులకు వ్యతిరేకం కాదని.. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్లు అలాగే కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు. విపక్షాలు దురుద్దేశపూర్వకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. అయితే ఈ బిల్లులతో వ్యవసాయం కూడా కార్పోరేట్ల కబంధ హస్తాల్లోకి వెళ్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.