వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారత్ బంద్ .. కొనసాగుతున్న ఆందోళనలు, పలు రైళ్ళు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘం సెప్టెంబర్ 25న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది . కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలలో రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో కార్యక్రమాలను చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల పోరు .. సెప్టెంబర్ 25న భారత్ బంద్ .. వివిధ రాష్ట్రాల్లో ఇలా !!
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్త బంద్
దేశవ్యాప్తంగా రైతులు ఈ రోజు నుండి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేయడానికి ‘భారత్ బంద్' ప్రకటించారు. ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లు, రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, మరియు రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లును పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మూడు బిల్లును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నేడు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు .
పంజాబ్ రాష్ట్రంలో మిన్ను ముడుతున్న ఆందోళనలు
కేంద్ర వ్యవసాయ సంస్కరణలు కనీస మద్దతు ధరల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడానికి పనికొస్తుందని, దీంతో చిన్న సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పంజాబ్ లోనే బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబ్ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సెప్టెంబరు 24 నుండి రైతులు బిల్లుకు వ్యతిరేకంగా మూడు రోజులపాటు రైలు రోకో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్ లోని చాలాచోట్ల రైల్వే ట్రాక్ పై విరుచుకుపడ్డారు. రైల్వే ట్రాకులపై టెంట్స్వేసుకుని కూర్చున్నారు .
భారీగా మోహరించిన భద్రతా బలగాలు
అక్టోబర్ 1 నుండి నిరవధిక రైల్ రోకో నిర్వహించాలని రైతు సంఘాల నిర్ణయం తీసుకున్నాయి. రైతుల నిరసనలకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ రైతులు శాంతిభద్రతలను పాటించాలని, సమ్మె సమయంలో కరోనా ప్రోటోకాల్స్ ను పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమృత్ సర్ నగరంలో పోలీసు సిబ్బంది మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు
పలు రైళ్ళు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రజాసంబంధాల అధికారి దీపక్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అమృత్ సర్ .. జయానగర్ ఎక్స్ ప్రెస్ నేడు రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఈ రైలును 27వ తేదీన కూడా రద్దు చేశారు. న్యూఢిల్లీ ఉనా హిమాచల్ స్పెషల్ రైలు ను తక్కువ దూరం నడపనున్నారు. అమృత్ సర్ - ముంబై సెంట్రల్ స్పెషల్ రైలును అంబాల వరకు నడపాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
కర్ణాటక - తమిళనాడులలోనూ ఆందోళనలు
ఫిరోజ్ పూర్ రైల్వే డివిజన్ లో 14 స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.వ్యవసాయ బిల్లులకు నిరసనగా కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి . కర్ణాటక-తమిళనాడు రహదారిపై బొమ్మనహల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం సభ్యులు నిరసన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కరోనా నిబంధనను పాటిస్తూనే నిరసనకారుల ఆందోళనల తెలిపారు.