భారత్ బంద్: బీజేపీకి షాక్ ఇచ్చిన జనసేన, ఎంఎన్ఎస్, కాంగ్రెస్ కు మద్దతు, అంతే!
న్యూఢిల్లీ: రోజురోజుకు పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో సెప్టెంబర్ 10వ తేదీ సోమవారం ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నీ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన, ఎంఎన్ఎస్ తదితర పార్టీలు భారత్ బంద్ కు మద్దతు ఇచ్చాయి.
భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకు పెరిగిపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి.
సామాన్యుడి మీద భారం పడుతున్న నిత్యవసర వస్తువులు మీద పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల ప్రభావం చూపిస్తున్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
భారత్ బంద్ కు కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. బెంగళూరు సిటీ బస్సులు (బీఎంటీసీ), కేఎస్ఆర్ టీసీ బస్సు సంచారం పూర్తిగా నిలిపివేయాలని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చే వారు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాలు, ఉద్యోగులు మనవి చేస్తున్నారు.