వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల పోరు .. సెప్టెంబర్ 25న భారత్ బంద్ .. వివిధ రాష్ట్రాల్లో ఇలా !!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘం సెప్టెంబర్ 25న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అఖిల భారత రైతు సంఘానికి మద్దతుగా ప్రతిపక్షాలతో పాటు దేశంలోని 250 చిన్న రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే సెప్టెంబర్ 25న బందు కొనసాగుతుందా? బంద్ ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ కు జంతర్ మంతర్లో ధర్నా చేసే దమ్ముందా .. రేవంత్ సవాల్ .. ఉత్తమ్ ఫైర్
భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), అఖిల భారత రైతు సంఘం (ఎఐఎఫ్యు), అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్సిసి), అఖిల భారత కిసాన్ మహాసంఘ్ (ఎఐకెఎం) ఉమ్మడి వేదికపైకి వచ్చి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 వ తేదీన నూతన వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారత్ బంద్ ప్రకటించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ప్రవేశపెట్టిన బిల్లులపై అసహనం వ్యక్తం చేస్తూ భారతీయ కిసాన్ కేంద్ర (బికెయు) నాయకులు, రైతులు నిరసన తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుండి రైతు సంఘాలు బంద్కు మద్దతు ఇస్తున్నాయి.
కర్ణాటకలో సెప్టెంబర్ 28న బంద్ .. బంద్ కు మద్దతుగా ..
ఓలా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ మరియు లారీ డ్రైవర్స్ అసోసియేషన్ కూడా రైతులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి . శుక్రవారం రోజు ప్రభుత్వ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా బంద్ పాటించాలని నిర్ణయించాయి. సెప్టెంబర్ 28 న కర్ణాటక బంద్ కోసం రైతు సంఘాలు పిలుపునిచ్చాయి . నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, హింద్ మజ్దూర్ సభ, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ మరియు ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా బంద్ కు మద్దతుగా నిలిచాయి.
పంజాబ్ లో నేటి నుండి మూడు రోజుల పాటు రైల్ రోకో
కేంద్ర వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా పంజాబ్లోని రైతు సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు రైల్ రోకో నిర్వహించనున్నాయి. ముఖ్యంగా రైలు మార్గాలు, జాతీయ రహదారులపై బంద్ ప్రభావం కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు రైలు రోకో ఆందోళన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు గా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ వెల్లడించింది. శిరోమణి అకాలీదళ్ పంజాబ్ అంతటా మూడు గంటలు రాస్తారోకో చేపట్టనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 25 న జరిగే నిరసనలలో 100 కి పైగా రైతు సంఘాలు పాల్గొంటాయని బికెయు తెలిపింది.
హర్యానా , యూపీలలో రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్
హర్యానా రాష్ట్రం విషయానికి వస్తే పార్లమెంట్లో వ్యవసాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా హర్యానా రాష్ట్రంలో రైతులు, ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్ 25 వ తేదీన రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని రైతులు తమ గ్రామాలు, పట్టణాలు, రహదారులను దిగ్బంధం చేసేలా నిర్ణయం తీసుకుంది.
Recommended Video
భారత్ బంద్ ను బలవంతంగా అడ్డుకుంటే భారీ మూల్యం చెల్లించాలని హెచ్చరిక
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేసే భారత్ బంద్ ను బలవంతంగా అడ్డుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇప్పటికే రైతు సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభం చేకూరుతుందని చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి లాభం చేకూరదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.బిల్లు ప్రవేశపెట్టే ముందు రైతు సంఘాలకు ఒకమాట కూడా చెప్పకుండా ,చర్చించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా నూతన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ రేపు భారత్ బంద్ లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది.