భారత్ బంద్: బీహార్, యూపీలో ఉద్రిక్తత, 144 సెక్షన్ అమలు
న్యూఢిల్లీ: కుల ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు మంగళవారం చేపట్టిన భారత్ బంద్ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు రోడ్లు, రైల్వే ట్రాక్లను నిర్బంధించారు. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 12 మందికి పైగా గాయపడ్డారు.
Bihar: Protesters protesting in Gaya's Manpur against caste-based reservations pelted stones after a clash with the police, several detained. pic.twitter.com/cIlmYZ1G8w
— ANI (@ANI) April 10, 2018
ఇప్పటికే పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బీహార్లోని పాట్నా, బెగుసరై, లఖిసరై, ముజఫర్పూర్, భోజ్పూర్ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు, కార్యాలయాలను మూసివేశారు. రైళ్లను అడ్డుకున్నారు. అరా ప్రాంతంలో భారత్ బంద్ ఆందోళనకారులు, రిజర్వేషన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
#WATCH: Clash between two groups in Bihar's Arrah during protests against caste-based reservations, gunshots heard. pic.twitter.com/s0RUA4KP2B
— ANI (@ANI) April 10, 2018
ఇక ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్లోనూ భారత్ బంద్ కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. రాజస్థాన్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బంద్ పాటించారు. కాగా, బంద్ దృష్ట్యా ఎలాంటి హింస చెలరేగకుండా చూడాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.
Rajasthan: Markets in Jhalawar shut during protests against caste-based reservations, protesters held a bike-rally. pic.twitter.com/PFSGDYKzgA
— ANI (@ANI) April 10, 2018
కాగా, ఈ ఏప్రిల్ నెలలోనే భారత్ బంద్ చేపట్టడం ఇది రెండోసారి గమనార్హం. ఎస్సీ, ఎస్టీల చట్టంలో కీలక నిబంధనలను సుప్రీంకోర్టు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. మధ్యప్రదేశ్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో 9 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాటి భారత్ బంద్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం అప్రమత్తం చేసింది.