మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.

కేంద్రం చేపడుతున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. కేంద్రం పారిశ్రామికవేత్తలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తమ పన్నెండు డిమాండ్లను కేంద్రం ముందుంచాయి. పది పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మెలో భాగంగా భారత్ బంద్, రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు.
- పది ట్రేడ్ యూనియన్లు 48 గంటల (జనవరి 8, 9) బంద్కు పిలుపునిచ్చాయి. అయితే మంగళవారం దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు.
- పశ్చిమ బెంగాల్లో తాము బంద్కు మద్దతివ్వడం లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. జరిగిందేదో జరిగిందని, గత 34 ఏళ్ల లెఫ్ట్ హయాంలో బంద్ల కారణంగా రాష్ట్రం బాగా నష్టపోయిందని, కాబట్టి అలాంటి బంద్లు తమకు వద్దని చెప్పారు.
- భారత్ బంద్ ప్రభావం దేశంలోని చాలా చోట్ల అంతగా కనిపించలేదని తెలుస్తోంది. ఎప్పుడైనా బంద్ ప్రభావం ఉదయమే తెలుస్తుంది. కానీ మంగళవారం ఉదయం ఎక్కువచోట్ల అంతగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.
- లెఫ్ట్ ప్రభుత్వం ఉన్న కేరళలో మాత్రం రైళ్లను అడ్డుకున్నారు. తిరువనంతపురం రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
- హౌరాలో కూడా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ మెంబర్స్ రైళ్లను అడ్డుకున్నారు.
- బంద్ కారణంగా పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.