భారత్ బంద్: జీఎస్టీ, పెట్రో ధరలకు నిరసనగా 40వేల వ్యాపార సంఘాలు, రైతు సంఘాల మద్దతు
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, జీఎస్టీ నియమాల్లో మార్పులు, ఈ-వే బిల్లులకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలు కూడా ఈ బంద్కు సంఘీభావం తెలిపాయి.
దేశ వ్యాప్తంగా 8 కోట్ల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 40వేల సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. ఈ మేరకు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ గురువారమే ప్రకటించారు. ఈ బంద్లో లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం కూడా పాల్గొంటున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
కాగా, మొదట చెప్పిన విధంగా జీఎస్టీని అమలు చేయడం లేదని సీఏఐటీ సెక్రటరీ ప్రవీణ్ తెలిపారు. దీని వల్ల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని దేశంలోని అనేక వ్యాపార సంఘాలు 200 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఫిబ్రవరి 22న ప్రధాని మోడీకి మెమోరాండం పంపాయని తెలిపారు.
జీఎస్టీ నియమాలను పునర్ పరిశీలించాలని ప్రవీణ్ కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు పెరుగుతున్న పెట్రోల్ ధరలు కూడా సామాన్యులకు పెనుభారంగా మారాయన్నారు. పెట్రో ధరలు తగ్గించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించింది.
కాగా, ఈ బంద్లో తాము పాల్గొనడం లేదని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యాపర్ మండల్, భారతీయ ఉద్యోగ్ వ్యాపర్ మండల్ స్పష్టం చేశాయి. ఈ రెండు సంఘాల కింద కూడా వందల సంఖ్యలో యూనియన్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ ప్రభావం మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో లారీలను నిలిపివేస్తామని యజమానుల సంఘం నేతలు తెలిపారు.