ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భారత్ బయోటెక్ బాసుల భేటీ: కోవాగ్జిన్పై కీలక చర్చ
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్న 'కొవాగ్జిన్' అభివృద్ధి పనుల వివరాలను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. భారత్లో తయారు చేస్తున్న ఈ టీకా పంపిణీ ప్రణాళిక గురించి చర్చించారు.
కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ ప్రయోగ పరీక్షలో ఉంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను భారత్ బయోటెక్ బీఎస్ఎల్-3(బయో సేఫ్టీ లెవల్-3) బయో కంటైనేషన్ సదుపాయంతో తయారు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వదేశీ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మెరుగవ్వాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లోని భారత్ బయెటెక్ను సందర్శించి కోవాగ్జిన్ అభివృద్ధి, ప్రయోగ పనులపై సమీక్షించారు.
కాగా, కోవాగ్జిన్ తీసుకున్నవారికి యాంటీ బాడీలు ఆరు నెలల నుంచి ఒక ఏడాది కాలంపాటు ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం.. ఈ టీకా వల్ల దీర్ఘకాలిక 'యాంటీ బాడీ, టీ-సెల్ మెమరీ రెస్పాన్స్' సాధ్యమని మెడ్రెగ్జివ్ .ఓఆర్జీ వెబ్సైట్ ఒక పరిశీలనా పత్రంలో వివరించింది. ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్లో భాగంగా కోవాగ్జిన్ వేసుకున్న వాలంటీర్లలో మూడు నెలల తర్వాత ఇటువంటి సానుకూల ఫలితాలను శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వెల్లడించింది.