భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్: వచ్చే నెలలోనే తొలి దశ ట్రయల్స్ ప్రారంభం
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మరో వ్యాక్సిన్ కూడా రానుంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ అభివృదధి చేస్తున్న కోవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు లభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం భారత్ బయోటెక్.. ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది.
ముక్కు ద్వారా వ్యాక్సిన్..
ఈ రెండో టీకాకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ టీకా అభివృద్ధికి సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ముక్కు ద్వారా ఒక్క డోసులోనే కరోనా టీకాను అందించే విధంగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
2.6 బిలియన్ల సిరంజీలతో కాలుష్యమే..
ముక్కు ద్వారా అందించే టీకా అభివృద్ధిపై ఇటీవల బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు మోతాదుల్లో అందించాల్సి ఉంటుందని, అందుకోసం 2.6 బిలియన్ల సిరంజీలు వాడాల్సి ఉంటుందని తెలిపారు. ఇవి కాలుష్యానికి కారణమవుతాయన్నారు. తమ టీకా భారత్ తలపెట్టిన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమ వ్యయంపై గణనీయమైన ప్రభావం చూపుతోందని తెలిపారు.
హ్యూమన్ ట్రయల్స్ వచ్చే నెల నుంచే
ముక్కు ద్వారా అందించే టీకా(బీబీవీ154) వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు, రోగ నిరోధకత, సవాళ్లను గుర్తించేందుకు భారత్, అమెరికాలో నిర్వహించిన ప్రీ క్లినికల్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని సంస్థ తెలిపింది. మొదటి దశ మానవ ప్రయోగాలు 2021 ఫిబ్రవరి-మార్చిలో మనదేశంలో ప్రారంభం కానున్నాయని భారత్ బయోటెక్ యాజమాన్యం తెలిపింది. కాగా, భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఇప్పటికే మూడు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైన విషయం తెలిసిందే. అంతేగాక, కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్కు కూడా డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే 10 రోజుల్లో తొలి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.