సిగ్గుచేటు, బాధాకరం: ‘భారత్ కీ బాత్’లో రేప్ ఘటనలు, కీలక అంశాలపై మోడీ
లండన్: చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు సిగ్గుచేటని, దీనిపై రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్ర మోడీ హితవు పలికారు. కథువా, ఉన్నావ్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రిని కాదని, 125 కోట్ల మంది భారతీయులకు సేవకుడినని మోడీ పునరుద్ఘాటించారు.
బ్రిటన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లండన్లోని ప్రఖ్యాత సెంట్రల్ హాల్, వెస్ట్ మినిస్టర్ వేదికగా తన అభిప్రాయాలను 'భారత్ కీ బాత్.. సబ్ కే సాథ్' పేరుతో స్థానిక భారతీయులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ ప్రసూన్ జోషి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పైగా సాగింది.
అత్యాచార ఘటనలపై..
రేప్ అనేది దారుణం. ఆందోళనకరం. దాన్ని ఎలా అంగీకరిస్తాం? మన బిడ్డలపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు. ఈ దారుణాలకు పాల్పడే వారు కూడా ఒక తల్లి బిడ్డలే. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలు అత్యంత బాధాకరం. చిన్న బాలికపై అత్యాచారం జరిగినపుడు చాలా బాధనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ మీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఇన్ని జరిగాయి. మా ప్రభుత్వంలో తక్కువ జరిగాయని చెప్పవచ్చా. వయసొచ్చిన కూతురు సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లిదండ్రుల్లో ఆందోళన నాకు తెలుసు' అని మోడీ చెప్పారు.
విమర్శలు స్వాగతిస్తా.. కానీ..
‘విమర్శలను స్వాగతిస్తాను. వాటికి మాటలతో సమాధానం ఇవ్వాలనుకోను. తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాను. నేను చరిత్రలో నిలిచిపోవాలనుకోవడం లేదు. నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకుంటున్నాను' అని మోడీ స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారిందన్నారు. భారత్ శాంతికాముక దేశమే కానీ.. దేశ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే ఉపేక్షించబోమంటూ పాక్పై గతంలో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ను గుర్తు చేశారు.
నన్ను నా దేశ ప్రజలు నమ్ముతారు
‘నోట్ల రద్దు చారిత్రక నిర్ణయం. నిజాయితీ, పారదర్శకత కోసం ప్రజలు కొంతవరకు త్యాగం చేస్తారని నేను విశ్వసించాను' అని ప్రధాని మోడీ తెలిపారు. ‘నేను సామాన్యుడినే. అందరిలో ఉండే బలహీనతలు నాకూ ఉన్నాయి. సామాన్య స్థాయి నుంచే వచ్చాను. నాకు గొప్పగొప్ప నానమ్మలు, తాతయ్యలు లేరు. నేను కష్టపడతాను. ఈ విషయాన్ని నా దేశ ప్రజలు కూడా నమ్ముతారు' అని మోడీ తెలిపారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్నాం
‘గత ప్రభుత్వాలతో పోలిస్తే అభివృద్ధి దిశగా దేశం దూసుకుపోతోంది. అధికారమిచ్చాం, అవకాశమిచ్చాం.. ఎందుకు చేసి చూపించరని ప్రజలు ప్రశ్నించటమే నాకు సంతోషాన్నిస్తుంది. ప్రజలకు నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇదే సంకేతం. 125 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావటమే.. భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. నేను రాయల్ ప్యాలెస్కు అతిథిగా రావటం 125 కోట్లమంది భారతీయుల సంకల్పమే' అని మోడీ వివరించారు.
నా దేశం అనే భావన రావాలి..
‘అభివృద్ధి కూడా స్వాతంత్య్రోద్యమం లాంటిదే. ప్రజలందరూ అభివృద్ధిపై తమ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అభివృద్ధి మన బాధ్యత. దేశం నాది, ఈ ప్రభుత్వం నాదనే భావన పెంచుకోవాలి అప్పుడు అభివృద్ధి ప్రజా ఉద్యమంలా దూసుకెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకుంటే మరుగుదోడ్ల నిర్మాణం కార్యక్రమం విజయవంతం కాకపోయేది. రైల్వే సబ్సిడీని 4 లక్షల మంది సీనియర్ సిటిజన్లు, ఎల్పీజీ సబ్సిడీని 1.25 కోట్ల మంది పౌరులు స్వచ్ఛందంగా వదులుకోవటమే దేశంలో ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనం' అని మోడీ తెలిపారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సర్జికల్ స్టైక్స్ తప్పవు.. ముందు పాక్కే
‘యూఎన్ శాంతిపరిరక్షక దళాల్లో ఎక్కువ భాగస్వామ్యం భారత్దే. అలాంటి శాంతికాముక దేశమైన భారత్.. పొరుగున్న పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. నా దేశ ప్రజలను చంపేస్తూ.. వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మా జవాన్ల తలలు నరుకుతున్నా నేను ఓపికగా ఉండలేకపోయాను. ఏ భాషలో చెబితే అవతలి వారికి అర్థమవుతుందో అలా చెప్పాను. సర్జికల్ స్ట్రైక్స్తో నా సైనికులు చేసిన పనికి నేను గర్వంగా ఫీలవుతున్నా. ఈ విషయంపై ముందు పాకిస్థాన్ మిలటరీకి సమాచారం ఇచ్చాకే భారత్లోనూ, మిగతా ప్రపంచానికి వెల్లడించాం' అని ప్రధాని మోడీ వివరించారు.
భారత్లో వెలుగులు నింపుతున్నాం
‘నేను పుస్తకాలు చదివి పేదరికం అంటే ఏంటో తెలుసుకోలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ విషయంలో రాజకీయం సరికాదు. రాజకీయం వేరు, పేదల జీవితంలో మార్పు తీసుకురావాలనే నా సమాజ నీతి వేరు. 70 ఏళ్ల తర్వాత 18వేల గ్రామాలకు విద్యుత్ లేకపోవటం దారుణం కాదా? మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. సౌభాగ్య పథకం ద్వారా 4కోట్ల కుటుంబాలకు (ఇళ్లకు) వెలుగునిచ్చాం. కొండలు, లోయలు, ఉగ్రవాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ ఇచ్చాం. 3 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలయ్యాయి' అని మోడీ స్పష్టం చేశారు.
ఆరోగ్య భద్రతపై.. మోడీకేర్
‘పిల్లలకు సరైన విద్య, యువతకు ఉపాధి, అసహాయులకు సరైన వైద్యం అందించటమే మా ప్రభుత్వ లక్ష్యం. దీనికోసమే పనిచేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోడీ కేర్గా పిలిస్తే నాకు అభ్యంతరమేం లేదు. సమగ్ర వ్యూహంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. తొలిగా దేశవ్యాప్తంగా 2 లక్షల వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. పేదల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. జెనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చాం. స్టెంట్ల ధరలు తగ్గించాం. పిల్లల ఆరోగ్యం కోసం గర్భిణులకు 26వారాల ప్రసూతి సెలవులిస్తున్నాం' అని మోడీ వివరించారు.
నా జీవితం ఇలా..
‘సీఎంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన కానుకలను వేలం వేసి.. ఈ డబ్బును బాలిక విద్యకు వెచ్చించాను. ఈ మొత్తం 100 కోట్లకు పైమాటే. రాజకీయ జీవితంలో ఉన్నందున రెండు దశాబ్దాలుగా రోజూ విమర్శలు నాకు అలవాటైపోయాయి. ఎవరిపైనా ఆధారపడకుండా.. నవ్వుతూ, ఆహ్లాదంగా ఉంటూ ప్రాణాలు పోవాలి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు యోగ, ధ్యానం చేస్తాను. యువత కూడా యోగపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతర్గత ఆరోగ్యానికి అదే అసలైన శక్తినిస్తుంది' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
బసవేశ్వరుడికి పుష్పాంజలి
అంతకుముందు ప్రధాని మోడీ బుధవారం థేమ్స్ నది ఒడ్డున అల్బర్ట్ ఎంబ్యాంక్మెంట్ గార్డెన్లోని 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం‘యూకే పర్యటన సందర్భంగా భగవాన్ బసవేశ్వరుడికి నివాళులర్పించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. బసవేశ్వరుడి ఆదర్శాలు ప్రపంచం మొత్తానికి ప్రేరణగా నిలుస్తాయి'' అని మోడీ కన్నడ, ఇంగ్షీష్లో ట్వీట్ చేశారు. లండన్లోని బసవేశ్వర ఫౌండేషన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.