అత్యుత్సాహం: భరతమాతగా ఖుష్బూ ఫ్లెక్సీ, వివాదాస్పదం
మదురై/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నటి ఖుష్బూను భారతమాతగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వివాదాస్పదమైంది. భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు పలువురు దీని పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మదురైలోని ఉత్తన్ కుడి బస్టాండు వద్ద గత నెల 26వ తేదీన ఓ ఫ్లెక్సీని కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేశాయి. అయితే, దానిని ఎవరు కూడా పట్టించుకోలేదు. అతిపెద్ద ఫ్లెక్సీ కావడంతో అందులో ఉన్నది ఎవరు గుర్తించలేదు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. సింహం పైన భారతమాత చేతిలో జెండాను పట్టుకున్నట్లుగా ఉంది.
బుధవారం స్థానికులు దానిని పరిశీలించారు. అందులో ఖుష్బూ ముఖం ఉన్నట్లుగా కనిపించింది. ఈ విషయం తెలిసిన బీజేపీ నాయకులు అక్కడకు వచ్చి నిరసన తెలిపారు. దాదాపు పదిరోజులుగా ఈ ఫ్లెక్సీ ఉంటున్నప్పటికీ.. ఎవరు పట్టించుకోకపోవడాన్ని ఖండించారు.
ఆ ఫ్లెక్సీని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దానిని వెంటనే తొలగించారు. కాగా, అందులోని పేర్ల ఆధారంగా దానిని ఏర్పాటు చేసిన వాళ్ల పైన కేసులు నమోదు చేశారు. దీని పై బీజేపీ మదురై జిల్లా అధ్యక్షుడు హరిధరణ్ పుదుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఆమె దక్షిణాది ఓటర్లను చేతి గుర్తు వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీల పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.