వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారతరత్న పురస్కారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అందించలేదు, ఎందుకని? అని ప్రశ్నించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ముఖ్లకు కేంద్రం భారతరత్న పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. హరిద్వార్లో మీడియాతో మాట్లాడారు.
రాజకీయ నాయకులు, నటుల కంటే సాధువులు తక్కువేం చేశారు
మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమారస్వామి వంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ సన్యాసిని థెరిస్సాకు ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది అయినా కేంద్రం హిందూ సన్యాసుల పట్ల సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. రాజకీయ నాయకుల కంటే, సినిమా తారల కంటే సన్యాసులు దేశానికి తక్కువ చేశారా అని ప్రశ్నించారు. వివేకానంద స్వామి, దయానంద సరస్వతిల సేవలు... నాయకులు, సినిమా తారల కంటే తక్కువా అని ప్రశ్నించారు.
శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలి
మరోవైపు, ఇటీవలే శివైక్యం పొందిన సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, జేడీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శివకుమార్ స్వామికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్లతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా డిమాండ్ చేశారు.
ఆయన సేవలు అమోఘం
శివకుమార్ స్వామి లక్షలాది మంది చిన్నారుల్లో నవ్వులు విరబూసేలా చేశారని, ఆయనను నడిచే దేవుడిగా కోట్లాది మంది పూజిస్తారని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. అతను కులాలకు, మతాలకు, దేశాలకు అతీతంగా లక్షలాది మందికి విద్యను, ఆహారాన్ని అందించేందుకు కృషి చేశారని చెప్పారు.
సిఫార్స్ చేశాం
తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివకుమార్ స్వామికి కర్ణాటక రత్న ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. శివకుమార్ స్వామి సేవలు దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి వారికి భారతరత్న ఇవ్వాలన్నారు. స్వామీజి శివైక్యం చెంది, భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ అతని సేవాతత్ర్పత, విద్య తదితర వాటి పట్ల ఆయన కృషి మన మదిలో ఆయనను ఎప్పటికీ ఉండేలా చేస్తుందని చెప్పారు.