మోడీ డబుల్ మేజిక్తో ఉక్కిరిబిక్కిరి! ఇదీ వాజపేయి, మాలవ్యా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి డబుల్ హ్యాపీనెస్ ఇచ్చారు! జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల అనంతరం తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఇది బీజేపీని మరింత సంతోషంలో ముంచెత్తింది.
సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా వల్ల బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఆయా రాష్ట్రాల ఎన్నికల్లోను మోడీ ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. తాజాగా జార్ఖండ్లోను పగ్గాలు చేపడుతోంది.
ఇక, జమ్మూ కాశ్మీర్లో క్రమంగా బీజేపీ బలం పెరుగుతుండటం ఆ పార్టీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తోంది. తాజా ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 25 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇదంతా మోడీ కారణంగానే అని బీజేపీ నేతలు బలంగా చెబుతున్నారు.
మంగళవారం నాటి జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల సంబరం నుండి బీజేపీ బయటకి రాకముందే కేంద్రం ఆ పార్టీ క్యాడర్ను వాజపేయికి భారతరత్న ప్రకటించి మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. వాజపేయి జన్మదినం డిసెంబర్ 25. రేపు జన్మదినంకు ముందు రోజు ఆయనకు కేంద్రం భారతరత్నను ప్రకటించింది. అదే రోజును కేంద్రం సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో బీజేపీ క్యాడర్ ఉప్పొంగుతోంది. మరో విషయమేమంటే వాజపేయికి భారతరత్న ఇవ్వడాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు ఆయనను 'రైట్ మన్ ఇన్ రాంగ్ పార్టీ' అని కీర్తించాయి.
ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ సంబరాల్లో మునిగితేలుతోంది. కాంగ్రెస్ కూడా దీనిని స్వాగతించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ తదితరులు అందరూ దీనిని స్వాగతించారు. కాగా, వాజపేయితో పాటు మదన్ మోహన్ మాలవ్యాకు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించింది.
అటల్ బిహారీ వాజపేయి
వాజపేయి 1924 డిసెంబర్ 25న ఉత్తర ప్రదేశ్లోని బదేశ్వర్లో జన్మించారు. అటల్ తండ్రి శ్రీకృష్ణ, తల్లి కృపాదేవి. వాజపేయి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. దేశసేవ కోసం ఆయన ఆరెస్సెస్లో చేరారు. దేశం కోసం బ్రహ్మచారిగా ఉండిపోయారు. 1951లో జనసంఘ్ ఏర్పాటు చేశారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా ఉన్నారు. 31 ఏళ్ల వయస్సులోనే లోకసభకు ఎన్నికయ్యారు.
1980లో అద్వానీ, షెకావత్లతో కలిసి బీజేపీని ఏర్పాటు చేశారు. 1980-86 మధ్య బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. బీజేపీ ఎదుగుదలలో వాజపేయీ, అద్వానీలది కీలకపాత్ర. వీరిద్దరి మధ్య ఐదు దశాబ్దాల సంబంధం ఉంది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వాజపేయి విదేశాంగ మంత్రిగా చేశారు.
వాజపేయి 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. మొదటిసారి పదమూడు రోజులు, రెండోసారి పదమూడు నెలలు ప్రధానిగా ఉన్నారు. 1999లో మూడోసారి ప్రధాని అయి సుస్థిర పాలన అందించారు. పోఖ్రాన్ అను పరీక్షలు, కాశ్మీర్ కన్యాకుమారి వరకు జాతీయ రహదారులు తదితరాలు వాజపేయి హయాంలోనివే.
మదన్ మోహన్ మాలవ్యా
మాలవ్యా యూపిలోని అలహాబాదులో 1861 డిసెంబర్ 25న జన్మించారు. తండ్రి బ్రిజ్నాథ్. తల్లి మూనాదేవి. విద్యావేత్త. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పని చేశారు. 1886లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1907లో అభ్యుదయ వేదిక, మరియాద హిందీ వారపత్రిక ప్రారంభించారు.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. 1919 నుండి ఇరవయ్యేళ్ల పాటు ఆ విశ్వవిద్యాలయానికి వీసిగా బాధ్యతలు నిర్వహించారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1941లో గోరక్ష మండల్ స్థాపించారు. చౌరాచౌరీ అల్లర్ల కేసులో ఉరిశిక్ష పడిన నిందితుల తరఫున వాదించారు. 1946 నవంబర్ 12న కన్నుమూసారు.