ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న: ఆరెస్సెస్ నేత, కమ్యూనిస్ట్ కవికి కూడా అత్యున్నత పురస్కారం
Recommended Video
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. గత ఏడాది నాగ్పూర్లో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యక్రమంలో మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించారు.
ఆయనతో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేంద్ర హజారికాలకు కూడా భారతరత్న ప్రకటించారు. వీరికి మరణానంతరం ఇచ్చారు. నానాజీ దేశ్ముఖ్ జనసంఘ్ నాయకులు. మాజీ రాజ్యసభ సభ్యులు. నానాజీ తన 93వ ఏట 2010 ఫిబ్రవరిలో కన్నుమూశారు.
భూపేన్ హజారికా అస్సామీ వాగ్గేయకారులు. మానవతావాదిగా హజారికా రచించిన పాటలు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. సంగీత దర్శకులు, గాయకులు, కవి. సంగీత దర్శకత్వంలో జాతీయ అవార్డుతో పాటు పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను హజారికా అందుకున్నారు. 2012లో ఆయన మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. హజారికా 2004లో లోకసభకు పోటీ చేశారు.
ఈ ముగ్గురికి ఇప్పుడు భారత అత్యున్నత పురస్కారం లభించింది. వీరికి భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఒకేసారి నిన్నటి వరకు కాంగ్రెస్ కురువృద్ధుడుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీకి, కమ్యూనిస్ట్ కవి హజారికాకు, ఆరెస్సెస్ నేత నానాజీకి ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.