భారత్ బంద్: బీజేపీ కంచుకోట, ఎమ్మెల్యేకి సెగ, పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లు, కమిషనర్!
బెంగళూరు: పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం దేశ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో సహ ఎన్డీఏ కూటమి వ్యతిరేక పార్టీలు అన్నీ బంద్ లో పాల్గొన్నాయి. భారత్ బంద్ సందర్బంగా అక్కడక్కడ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం విఫలం
పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ కు ప్రజల నుంచి మద్దతు లభించింది. పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలతో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ కంచుకోట
కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లా, కరావళి ప్రాంతాలు బీజేపీకి కంచుకోట. ఈ ప్రాంతాలలో సోమవారం బంద్ విజయ వంతం అయ్యింది. బంద్ నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించలేదు. అయితే అక్కడక్కడ బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది.
బీజేపీ ఎమ్మెల్యే కారు
మంగళూరు నగరంలోని జ్యోతి సర్కిల్ లో అటు వైపు సంచరిస్తున్న వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అదే సమయంలో మంగళూరు దక్షిణ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్ కారులో అటు వైపు వెళ్లడంతో ఆయన వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజల్ ధర పెంపునకు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లు
బీజేపీ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్ కు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బలవంతంగా బంద్ నిర్వహిస్తున్న వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యే వేదవ్యాస్ అక్కడే ఉన్న మంగళూరు నగర పోలీసు కమిషనర్ టీఆర్. సురేష్ ను డిమాండ్ చేశారు. అయితే పోలీసు కమిషన్ టీఆర్. సురేష్ ఇరు వర్గాలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరించి బంద్ కు మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే వేదవ్యాస్ ఆరోపించారు. ఆ సందర్బంలో ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్, పోలీసు కమిషనర్ టీఆర్. సురేష్ మధ్య వాగ్వివాదం జరిగింది.