కోర్టుకు భత్కల్: ఉగ్రవాది అనుచరుడి ఇజాజ్ అరెస్ట్
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఉగ్రవాది యాసిన్ భత్కల్ను శుక్రవారం పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపర్చారు. కాగా, దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లు, వాటి వల్ల సంభవించిన మరణాల పట్ల తనకు ఏమాత్రం బాధ, పశ్చాత్తాపం లేదని హైదరాబాద్ జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు భత్కల్ చెప్పిన విషయం తెలిసిందే.
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసుకు సంబంధించి భత్కల్, అసదుల్లా అక్తర్లను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. భత్కల్ తాను చేసిన నేరాలను ఏకరువు పెడుతూనే, వాటి పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని చెబుతున్నాడు. భత్కల్, అసదుల్లా ఇద్దరు కూడా అదే జవాబిస్తుండటంతో విచారణాధికారులు ఖంగుతింటున్నారు.
అంతేకాకుండా అలాంటి నేరాలు మళ్లీ చేస్తామని చెబుతున్నారు. పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకే వీరు పేలుళ్లకు పాల్పడుతున్నారు. పేలుళ్లకు పాల్పడింది తామేనని, ఇంకా పేలుళ్లు జరుపుతామని, తమ లక్ష్య సాధన కోసం ఏమైనా చేస్తామని, అందులో తమకు తప్పు కనిపించడం లేదని చెప్పారు.
ఇజాజ్ అరెస్టు
ఉగ్రవాది అజం ఘోరీ అనుచరుడు, ఇజాజ్ అహ్మద్ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి భారత్ వస్తుండగా కువైట్లో ఇజాజ్ అహ్మద్ను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడలో లారీ డ్రైవర్ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారని సమాచారం.