దద్దరిల్లిన ఢిల్లీ జమా మసీదు.. భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ రీఎంట్రీతో మారిన సీన్.. కోర్టు వద్దన్నా వినకుండ
Recommended Video
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో ప్రార్థనలు చేసిన ముస్లింలు రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మసీదులో మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. బెయిల్ పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం జమా మసీదుకు రావడంతో ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది.
బెయిల్ కండిషన్లు ధిక్కరిస్తూ..
భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్.. గతంలో ఇదే జమా మసీదులో సీఏఏ నిరసనలో పాల్గొన్నందుకు అరెస్టయిన సంగతి తెలిసిందే. మూడువారాలపాటు జైలులో ఉన్న ఆయనకు.. అనేక కండిషన్లతో తీస్తా హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం రాత్రే జైలు నుంచి విడుదలైన ఆజాద్... బెయిల్ కండిషన్లను బేఖాతరు చేస్తూ ఆందోళనల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది.
కాదు.. కోర్టు చెప్పినట్లే..
కాగా, తాను జమా మసీదుకు వచ్చింది నిరసనలో పాల్గొనడానికి కాదని, ప్రార్థనా స్థలాలకు వెళ్లే హక్కుందని కోర్టు చెప్పడం వల్లే దర్శించుకుంటున్నానని, మసీదుకు రావడానికి ముందు ఆలయానికి, గురుద్వారాకు కూడా వెళ్లొచ్చానని ఆజాద్ చెప్పుకొచ్చారు. ‘‘ప్రార్థనాలయాల్లో నినాదాలు చేయడంగానీ, ఆందోళనలకు నాయకత్వ వహించడంగానీ ఏదీ చెయ్యలేదు. కేవలం రాజ్యాంగ పీఠికను చదివి వచ్చేశాను''అని వివరించారు.
ఢిల్లీ వదిలి వెళ్లాలి..
భీమ్ ఆర్మీ చీఫ్ కు బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు భారీ కండిషన్లు విధించింది. ఈనెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సిటీలో ఉండొద్దని, ఢిల్లీ చుట్టుపక్కల ఎక్కడా సీఏఏ నిరసనల్లో పాల్గొనొద్దని స్పష్టంగా పేర్కొన్న కోర్టు.. రూ.25వేల పూచీకత్తుపై బెయిలిచ్చింది. తాను బెయిల్ కండిషన్లు మీరలేదని మీడియాకు చెప్పిన ఆజాద్.. శుక్రవారం సాయంత్రంలోగా ఢిల్లీ వదిలి వెళ్లిపోతానని తెలిపారు.