వారణాసి పోటీ నుంచి తప్పుకున్న భీం ఆర్మీ చీఫ్ : కారణమిదేనా ?
న్యూఢిల్లీ : వారణాసి నుంచి తాను పోటీ చేయడం లేదని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టంచేశారు. ప్రధాని మోదీపై పోటికి దిగుతున్నట్టు ఆయన గత నెలలో ప్రకటించారు. ఆజాద్ నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి తప్పుపట్టారు. దీంతో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు.
బీజేపీకి లాభం కలుగుతుందని ..
బీజేపీకి, ప్రధాని మోదీకి లాభపడే విషయానికి మద్దతు తెలుపనని స్పష్టంచేశారు. బీజేపీని ఓడించడమే భీమ్ ఆర్మీ, ఎస్పీ, బీఎస్పీ లక్ష్యమని వివరించారు. ఇదివరకు పోటీచేస్తానని ప్రకటించిన సమయంలో మాయావతి తనపై విమర్శలు చేశారని .. ఇప్పటికీ తాను మాయావతి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు ఆజాద్ పేర్కొన్నారు.
మిశ్రాను బరిలోకి దింపండి ..
వారణాసిలో బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థిగా మిశ్రాను బరిలోకి దింపాలని ఆజాద్ సూచించారు. దీంతో అగ్రవర్ణాల ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుందని ఆజాద్ అంచనా వేశారు. అయితే వారణాసి నుంచి మిశ్రా పోటీ చేస్తే దళితుల ఓట్లు చీలుతాయని, బీజేపీకి మేలు జరుగుతుందని ఇటీవల విమర్శలు వచ్చాయి. దీంతో ఆజాద్ బీజేపీకి ఏజెంట్లా పనిచేస్తున్నాడని ఇటీవల మాయావతి ఆరోపించారు.
అభ్యర్థి ఎవరు ?
వారణాసి నుంచి మోదీకి పోటీకి బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. చివరిదశ ఎన్నికల్లో భాగంగా మే 19న వారణాసి ఎన్నిలు జరుగనున్నాయి. మే 23న ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం లెక్కించనుంది.