ప్రశాంతంగా భీమా కోరేగావ్ వార్షికోత్సవం.. అజిత్ పవార్ సహా మంత్రుల హాజరు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా ఈ ఏడు భీమా కోరెగావ్ వార్షికోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. భీమా కోరేగావ్ యుద్ధానికి ఇవాళ్టితో 202 ఏళ్లు నిండాయి. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దాదాపు 5 లక్షల మంది దళితులతో పుణె జిల్లాలోని పెర్నే గ్రామంలో సందడి నెలకొంది.
డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులూ..
భీమా కోరేగావ్ యుద్ధం జరిగిన స్థలంలో ఏర్పాటు చేసిన ‘విజయ స్తూపం' వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుంచి దళితులు వచ్చారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం ఉదయమే పెర్నే వెళ్లి విజయ్ స్తూపాన్ని సందర్శించుకున్నారు. ఆయనతోపాటు ఎన్సీపీ కీలక నేతలు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం తర్వాత పలువురు మంత్రులు కూడా భీమా కోరేగావ్ వార్షికోత్సవానికి హాజరయ్యారు.
టైట్ సెక్యూరిటీ.. ఇంటర్నెట్ బంద్..
రెండేండ్ల కిందట ఇక్కడ భీకర ఘర్షణలు చోటుచేసుకోవడం, దానిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో భీమా కోరేగావ్ వార్షికోత్సవాలకు సెక్యూరిటీ పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవకు ప్రకటించారు. పెర్నేతోపాటు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
అసలేం జరిగిందంటే..
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి చెందిన మహర్ రెజిమెంట్కు, కున్నత కులాలైన పీష్వాలకు మధ్య పుణెలోని పెర్నే ప్రాంతంలో.. 1818, జనవరి 1న జరిగిన యుద్ధాన్నే భీమా కోరేగావ్ యుద్ధంగా చరిత్ర చెబుతోంది. పుణెకు దగ్గరల్లోని కోరేగావ్లో భీమా నది ఒడ్డున జరగడంతో ఈ యుద్ధానికి ఆ పేరు వచ్చింది. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పీష్వాలతో కలిసి పోరాడుతామని దళితులు ముందుకురాగా.. అందుకు బాజీరావ్ పీష్వా నిరాకరిస్తాడు. దీంతో దళితులంతా బ్రిటిష్ సైన్యంలో చేరతారు. నిజానికి ఇది రెండో బాజీరావు పీష్వాపై బ్రిటిషర్లు సాధించిన విజయమైనప్పటికీ... కుల వివక్షపై దళితులు సాధించిన గెలుపుగానూ భీమా కోరేగావ్ ప్రసిద్ధికెక్కింది. నాటి యుద్ధంలో చనిపోయినవారి గుర్తుగా బ్రిటిషర్లు ‘విజయ స్తూపం'ఏర్పాటుచేశారు. దళితులు భీమా కోరేగావ్ ను విజయోత్సవంగా జరుపుకోవడాన్ని పెద్దకులాలు, పలు హిందూ సంస్థలు తప్పుపడతాయి.