కోరేగావ్ - భీమా ఘటన: ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై ఫిర్యాదు
ముంబై: కోరేగావ్ - భీమా సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, జేఎన్యూ యాక్టివిస్ట్ ఉమర్ ఖలీద్లపై కేసు నమోదు చేయాలని ఇద్దరు యువకులు పుణే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు రెచ్చగొట్టడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని వారు ఆరోపించారు.
జిగ్నేష్ మేవానీ వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గొడవకు కారణం అయిందని అక్షయ్, ఆనంద్ అనే ఇద్దరు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్ల పైకి వచ్చి నిరసన తెలపాలని, ఈ కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఘర్షణలు: ఆరెస్సెస్-బీజేపీపై రాహుల్ గాంధీ నిప్పులు
కాగా, మహారాష్ట్ర అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. నిరసనలు, వాహనాల కాల్చివేత, రహదారులపై బైఠాయింపులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనేకచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. స్థానిక రైళ్లు తిరగలేదు. పెద్దఎత్తున బస్సుల్ని దహనం చేశారు. అనేక పట్టణాల్లో జన జీవనం తీవ్రంగా ప్రభావితమయింది.
ఆంగ్లేయుల పాలనలో చోటు చేసుకున్న భీమా కొరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో చెలరేగిన హింస కారణంగా 28 ఏళ్ల పురుషుడు చనిపోవడంపై మంగళవారం మహారాష్ట్ర అంతటా నిరసనలు ఎగిసిపడ్డాయి. ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలో ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తాయి.
పుణెలో మొదలైన ఆందోళనలు అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. కొల్హాపూర్, పర్భణి, లాతూరు, అహ్మద్నగర్, ఔరంగాబాద్, నాందేడ్ తదితర చోట్ల వందలాది మంది పోటాపోటీ ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ వారి విజయంపై పండుగ చేసుకోవడమేమిటని వ్యతిరేకించిన హిందూ ఏక్తా అఘాడీ, శివరాజ్ ప్రతిష్ఠాన్ సంస్థల నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. బుధవారం బంద్ నిర్వహిస్తున్నారు.