భీమా కోరేగావ్ అల్లర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: 5000 పేజీల ఛార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకు బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. ఈ కేసులో అయిదు మంది ప్రధాన నిందితులపై ఛార్జిషీట్ ను నమోదు చేయడానికి 90 రోజుల అదనపు సమయం ఇవ్వడానికి అనుమతి ఇస్తూ ఇదివరకే బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనితో ప్రధాన నిందితుడైన సురేంద్ర గాడ్లింగ్ సహా నలుగురికి బై డిఫాల్ట్గా లభించే బెయిల్ ఇక దొరకదు.
భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, నాగ్ పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ షోమా సేన్, దళిత సంఘాల కార్యకర్త సుధీర్ ధవాలే, సామాజిక కార్యకర్తలు మహేష్ రౌత్, కేరళకు చెందిన రోనా విల్సన్ లను గత ఏడాది 24వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులో వారికి సంబంధాలు ఉన్నాయని వారిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాల నిరోధర చట్టం (యూఏపీఏ) కింది మహారాష్ట్ర పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. గత ఏడాది జూన్ నుంచి వారు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పటిదాకా మహారాష్ట్ర పోలీసులు ఆ అయిదుమందిపై ఛార్జిషీటును దాఖలు చేయలేదు.
ఛార్జిషీటును దాఖలు చేయడానికి 90 రోజుల అదనపు సమయం తమకు కావాలంటూ మహారాష్ట్ర పోలీసులు ఇదివరకు పుణే న్యాయస్థానానికి పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కోరినట్టుగా పుణే న్యాయస్థానం వారికి అనుమతి ఇస్తూ, ఉత్తర్వులను జారీ చేసింది. అనంతరం ఈ కేసు బోంబే హైకోర్టుకు చేరింది. దీనిపై దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన బోంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది. నిందితులపై వెంటనే ఛార్జిషీట్ ను దాఖలు చేయడానికి మార్గం సులువు చేసింది.
ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై వాదోపవాదాలను ఆలంకించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ ఎల్ ఎన్ రావులు ఈ పిటీషన్ పై విచారణ చేపట్టారు. బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చారు. అనంతరం.. తమ తుది తీర్పును రిజర్వ్ చేశారు.
నిందితులపై ఛార్జిషీట్ ను దాఖలు చేయడానికి 90 రోజుల అదనపు సమయాన్ని ఇస్తూ గతంలో భీమా-కోరేగావ్ అల్లర్లపై పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. సాధారణ బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటీషన్ పై పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభావం చూపుతుందా? లేదా? వివరణ ఇవ్వాలని సూచించింది.
పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటీషన్ పై బోంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదుల భట్కర్ విచారణ చేపట్టారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ తాత్కాలికంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నవంబర్ 1వ తేదీ వరకు ఈ కేసును అబెయన్స్ లో పెట్టారు. అనంతరం.. ఈ కేసు సుప్రీంకోర్టు మెట్టెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తాజాగా బుధవారం.. తన తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు నిందితులకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న అయిదుమందిపై ఛార్జిషీటు దాఖలు చేయడానికి మహారాష్ట్ర పోలీసులకు ఇక గడువు దొరక్కపోవచ్చు. బై డిఫాల్ట్గా కూడా వారికి బెయిల్ లభించే అవకాశలకు ఉన్న దారులు మూసుకుపోయినట్టే. ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలను కూడా ఈ అయిదుమంది ఎదుర్కొంటున్నారు. 5000 పేజీల ఛార్జిషీట్ ను మహారాష్ట్ర పోలీసులు దాఖలు చేయవచ్చే అవకాశం ఉంది. ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన విప్లవ రచయిత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించిన అనంతరం విడుదల చేసిన విషయం తెలిసిందే.