ఆందోళనలతో అట్టుడికిన ముంబై: నేడు మహారాష్ట్ర బంద్
Recommended Video
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుణె జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన ఘర్షణలకు నిరసనగా ముంబైలో పలుచోట్ల దళితులు ఆందోళనకు దళితులు దిగారు. దుకాణాలను బలవంతంగా మూసివేయించారు.
రోడ్లను దిగ్బంధించి, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళన కారణంగా పలుచోట్ల లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనల్లో ఓ టీవీ ఛానెల్ జర్నలిస్టు గాయపడ్డారు. మరోవైపు సోషల్మీడియా ద్వారా వదంతులు వ్యాపింపజేయొద్దని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. సోమవారం నాటి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించారు. ఈ హింసాత్మక ఘటన వెనుక ఉన్నదేవరో తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, భీమా కోరేగావ్ పోరాటం 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దళితులు పుణె జిల్లాలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసనలు చేపట్టారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో రోడ్లు దిగ్బంధించారు. రైల్రోకో చేపట్టారు. దీంతో చెంబూర్-గోవంది మధ్య రైలు సేవలు నిలిచిపోయాయి. కుర్లా-వాషి మధ్య సబర్బన్ సర్వీసుల్ని సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర బంద్
కాగా, మరోవైపు బుధవారం మహారాష్ట్ర బంద్కు భారిప బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) నేత, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. బంద్కు మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫ్రంట్, మహారాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్, మరో 250 సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.