దారుణం: పక్కతడిపిందని బాలిక ప్రైవేటు భాగాలను కాల్చారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పక్కతడిపిందనే నెపంతో ఐదేళ్ల బాలిక ప్రైవేట్ భాగాలను మహిళా సంరక్షకురాలు మరొక బాలికతో కాల్పించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న తన ఐదేళ్ల కుమార్తె ప్రైవేట్ భాగాలపై కొవ్వొత్తితో కాల్చారని దళితరాలైన బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు కళావతి సింగ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
వసత గృహంలో ఆశ్రయం పొందుతున్న మరో ఇద్దరు చిన్నారులు కూడా ఇదే వేధింపులకు గురైనట్లు విచారణ అధికారులు గుర్తించారు. కాగా, నిందితురాలిని కఠినంగా శిక్షించాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఎబోలా తరహా లక్షణాలతో వ్యక్తి మృతి
ఢిల్లీ: ఎబోలా వ్యాధి తరహా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో 35ఏళ్ల వ్యక్తి ఒకరు మృతి చెందారు. జోధ్పూర్కు చెందిన ఆ వ్యక్తి ఎబోలా వ్యాధి అనుమానంతో మంగళవారం ఎయిమ్స్లో చేరారు. బుధవారం ఉదయం అంతర్గతంగా అధిక రక్తస్రావం వల్ల మృతి చెందాడు. అయితే ఆ వ్యక్తి ఎబోలా వల్ల మృతి చెందక పోవచ్చని, క్రిమియన్ కాంగో హెమరాజిక్ ఫీవర్(సిసిహెచ్ఎఫ్) కారణంగా మృతి చెంది ఉంటాడని వైద్యులు తెలిపారు.
అతనికి సంబంధించిన రక్త నమూనాలను పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఎబోలా వ్యాధిలానే సిసిహెచ్ఎఫ్ వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జంతువుల ద్వారా వాటికి సన్నిహితంగా ఉండేవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పారు. ఎబోలా, డెంగ్యూ వ్యాధిలానే అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, అధికంగా వణుకుతోపాటు అంతర్గత రక్తస్రావం అధికంగా జరుగుతుందని తెలిపారు.