చిత్రం విచిత్రం : మొగుడి పిలకపై అలక.. విడాకుల కోసం అప్లై
భోపాల్ : మధ్యప్రదేశ్లో చిత్ర విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. భర్త పిలక మీద అలకబూనిన భార్యామణి ఏకంగా కోర్టు మెట్లెక్కింది. మొగుడితో కాపురం చేసేది లేదంటూ తేల్చేసింది. విడాకులు ఇప్పించడంటూ న్యాయమూర్తిని వేడుకుంది. మరి ఇంత రచ్చ చేసిన ఆవిడ నిరక్షరాస్యులేమి కాదు, లోకం పోకడ తెలియంది అంతకన్నా కాదు. పీజీ పూర్తిచేసిన విద్యాధికురాలు కావడం గమనార్హం.
ప్రియాంక గాంధీ ఫీట్లు.. బారికేడ్ల పైనుంచి దూకి.. జనంతో కలిసి (వీడియో)
చదువుకున్నదని పెళ్లి చేసుకుంటే..!
భోపాల్ ప్రాంతంలో నివాసముండే ప్రవీణ్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించేవారు. ఆ క్రమంలో ఎంబీఏ చదువుతున్న ప్రత్యూషి అనే అమ్మాయితో లవ్లో పడ్డాడు. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. సీన్ కట్ చేస్తే విడాకుల వరకు వెళ్లింది వ్యవహారం.
గుండు మీద పిలక.. తెచ్చిందయ్యో తంటా
రెండేళ్లు సజావుగా సాగిన వారి కాపురంలో పిలక చిచ్చుపెట్టింది. అసలు పిలకేంటి.. ఈ అలకేంటి అనుకుంటున్నారా?. కొద్దిరోజుల కిందట హెయిర్ కటింగ్ చేయించుకుంటానంటూ వెళ్లిన ప్రవీణ్.. గుండు గీయించుకుని మధ్యలో కాస్తా పిలక ఉంచుకుని వచ్చారు. సదరు భార్యామణికి అది చూసి సుర్రుమంది. గుండు తీసుకున్నారు పర్వాలేదు.. మరి ఆ పిలక సంగతేంటని నిలబెట్టి కడిగేసింది. భర్త ఎంత సర్ధిచెప్పినా వినిపించుకోలేదు. ఆ పిలక తీస్తే నేనుంటా.. లేదంటే నువ్వొద్దు, నీ కాపురమొద్దంటూ మొండికేసింది.
కౌన్సిలింగ్ ఇప్పించాలని తీర్పు
మొత్తానికి పచ్చని కాపురంలో ఆ పిలక రాజేసిన చిచ్చు అంతా ఇంతా కాదు. పిలక తీసేయ్యాలంటూ ఆమె.. తీసేయబోనంటూ ఆయన.. అలా ఇద్దరి పీకులాట పీక్ స్టేజీకి చేరింది. ఇతర విషయాల్లో ఏమో గానీ, ఆ పిలక విషయంలో భర్త తన మాట వినడం లేదంటూ చివరకు కోర్టు మెట్లెక్కింది. భర్త నుంచి విడిపోతానంటూ విడాకులకు అప్లై చేసింది.
అసలేం జరిగిందంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు.. ఆమె చెప్పిన సమాధానాలు విని విస్మయానికి గురయ్యారు. చిన్న విషయానికే ఇంత రాద్ధాంతమా అని ఆశ్చర్యపోయారు. పిలక కారణంగా తన భర్త అందంగా కనిపించడని.. చూసేవారంతా నవ్వుకుంటారనేది ఆమె చెప్పిన మాట. దాంతో సదరు భార్యామణికి కౌన్సిలింగ్ ఇప్పించాలని తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. అక్కడితో ఎండ్ కార్డు పడింది.