బడా కుటుంబానికి చెందిన కోడలిపై.. 'భార్యల మార్పిడి' వేధింపులు
భువనేశ్యర్ : పెద్దింటి కుటుంబాలకు చెందిన కొంతమంది వ్యక్తులు.. విలాసవంతమైన భోగాలకు అలవాటు పడి అడ్డదారులు తొక్కుతున్నారు. ఎంజాయ్ మెంట్ పేరుతో నీతిమాలిన చర్యలకు పాల్పడుతూ.. అదే క్రమంలో కట్టుకున్న భార్యలను సైతం తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
చేతిలో డబ్బు.. సమాజంలో పలుకుబడి.. ఏం చేసినా చెల్లుతుందననే ధీమాతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రబుద్దులు. తాజాగా భువనేశ్వర్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్త త్రిలోక్యనాథ్ మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా తన భర్తపై ఇలాంటి ఫిర్యాదే చేయడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇక అసలు విషయానికొస్తే.. తనకు ప్రాణ హాని తలపెడుతామంటూ కొంతమంది వ్యక్తులు తనపై బెదిరింపులకు పాల్పడుతుండడంతో మంగళవారం రాత్రి స్థానికి బర్ గడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లోపముద్ర. అయితే ఈ బెదిరింపుల వెనుక ఉన్నది తన అత్త, మామ, భర్దేనని ఆరోపిస్తోంది లోపముద్ర.
వివాహమైన కొత్తలో హనిమూన్ కోసం భర్తతో కలిసి విదేశాలకు వెళ్లగా.. అక్కడ భర్త వేధింపులకు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిపింది లోపముద్ర. ఆ సమయంలో వైఫ్ స్వాపింగ్ (భార్యల మార్పిడి) చర్యకు ఒప్పుకోవాలంటూ తన భర్త తనపై ఒత్తిడి తెచ్చాడని, దానికి తను ససేమిరా అనడంతో అప్పటినుంచి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది.
అయితే పేరున్న కుటుంబం కావడంతో గౌరవ మర్యాలకు ఎక్కడ భంగం కలుగుతుందోనన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ ఓపిక పడుతూ వచ్చానని, అయితే తానెంత ఓపిక పట్టినా.. వేధింపులు ఎక్కువయ్యాయే గానీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక పోలీసులను ఆశ్రయించక తప్పలేదని వెల్లడించింది.
కాగా, ఇదే విషయమై లోపముద్ర నెలరోజుల కిందటే స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా.. అలసత్వంగా వ్యవహరించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా ఆమె మరోసారి ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందు నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టడంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే లోపముద్ర ఫిర్యాదు పట్ల డీసీపీ సత్యబ్రోతో భోయి స్పందించారు. ఫిర్యాదు నేపథ్యంలో తక్షణమే త్రిలోక్యనాధ్ కుటుంబాన్ని విచారించి నిజాలను రాబడుతామని హామి ఇచ్చారు.