వద్దని చెప్పలేదుగా.. శబరిమల వెళ్తా: తృప్తి దేశాయ్: సన్నిధానంలో మహిళలకు ప్రవేశం మాటేంటీ?
ముంబై: తృప్తి దేశాయ్. భూమాత బ్రిగేడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధురాలు. సామాజిక ఉద్యమకారిణి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత.. పట్టుబట్టి మరీ సన్నిధానానికి చేరుకున్నారు కూడా. మణికంఠుడిని దర్శించిన అతి కొద్దిమంది మహిళల్లో ఆమె ఒకరు.
పెండింగ్లో శబరిమల తీర్పు: ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనకు: బెంచ్లో భేదాభిప్రాయాలు
మరి కొందర్ని తీసుకెళ్తా..
శబరిమల ఆలయంలో మహిళకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును పెండింగ్ లో ఉంచిన నేపథ్యంలో ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సుప్రీంకోర్టు తన తీర్పును పెండింగ్ లో ఉంచడం వల్ల మహిళల ప్రవేశంపై ఇదివరకు ఉన్న యధాతథ స్థితినినిర్ణయం కొనసాగించినట్టయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో- తాను త్వరలోనే శబరిమల ఆలయానికి వెళ్తానని అన్నారు. అయ్యప్పస్వామిని దర్శించుకుంటానని, తనతో పాటు మరి కొందరిని కూడా తీసుకెళ్తానని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు.
సాధ్యమైనంత త్వరగా.. తీర్పు
తీర్పును పెండింగ్ లో ఉంచడం పట్ల ఆమె ఎలాంటి స్పందననూ వ్యక్తం చేయలేదు. ఏడుమంది న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలనకు పంపించడం పట్ల తాను స్పందించబోనని అన్నారు. ఆ ధర్మాసనం శబరిమల కేసు తీర్పు విషయంలో జాప్యం చేయకూడదని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా తుది తీర్పును వెలువరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. జాప్యం చేయడం వల్ల ఆలయానికి వెళ్లడానికి మహిళలు పెద్ద సంఖ్యలో సన్నద్దమౌతారని చెప్పారు. మహిళల ప్రవేశం కల్పించాలా? వద్దా? అనే విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడబోవని అన్నారు.
తొలి రోజే దర్శనానికి..
ఈ సీజన్ లో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం తలుపులు ఈ నెల 16వ తేదీన తెరచుకోబోతున్నాయని, అదే రోజు వెళ్లేలా తాను ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లు తెలిపారు. తన దర్శనాన్ని ఎవ్వరూ అడ్డుకోబోరని ఆశిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఏ విషయాన్ని తేల్చలేదని, ఫలితంగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పించడంపై ఇదివరకు ఉన్న స్థితే ఇప్పుడు కొనసాగుతుందని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. శబరిమల వంటి కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశాన్ని కల్పించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోవని, మహిళలకు సమాన హక్కులను కల్పించినట్టవుతుందని చెప్పారు.
తీర్పునకు అనుకూలంగా ముగ్గురు.. ప్రతికూలంగా ఇద్దరు
శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి అనుమతి ఇచ్చే విషయంలో అయిదుంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనంలో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు ప్రవేశాన్ని నిషేధించడానికి ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు. మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రా మహిళల ప్రవేశానికి నిషేధించడానికి అనుకూలంగా ఉండగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వారికి ప్రవేశం కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్పును పెండింగ్ లో ఉంచారు.