భూపేన్ హజారికాను వరించిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించిన కుమారుడు తేజ్
అస్సోం ముద్దు బిడ్డ భారత రత్న గ్రహీత భూపేన్ హజారికా కుమారుడు తన తండ్రికి వచ్చిన అత్యున్నత పౌర పురస్కారం అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. అస్సోం సిటిజన్ షిప్ బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సోం పౌరసత్వ బిల్లును కేంద్రం లోక్సభలో పాస్ చేయడాన్ని భూపేన్ హజారికా కుమారుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే భూపేన్ హజారికా సోదరుడు మాత్రం భారతరత్న ఇవ్వడంపై వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే భారతరత్న ఇవ్వడాన్ని భూపేన్ హజారికా కుమారుడు తేజ్, తిరస్కరిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేజ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తూ ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల మనోభావాలను నరేంద్ర మోడీ సర్కార్ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అదేసమయంలో వారి సెంటిమెంట్లను కూడా గౌరవించాలని మమతా బెనర్జీ చెప్పారు. తన తండ్రి భూపేన్ హజారికా పేరును, ఆయన రాసిన పదాలను కేంద్రం వాడుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తేజ్... లోక్సభలో అస్సోం పౌరసత్వ బిల్లును పాస్ చేయడం చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాలపై హజారికా కన్న కలలను ప్రభుత్వం అనగదొక్కేలా వ్యవహరిస్తోందని సోమవారం తన ఫేస్బుక్లో పోస్టు చేశారు తేజ్. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చి ఆరేళ్లకు పైబడి అస్సోంలో స్థిరపడిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం ఇస్తూ కేంద్రం బిల్లు పాస్ చేసింది. అంతకుముందు అస్సోంలో 12 ఏళ్లకు పైబడి అక్కడ నివాసం ఉంటున్నవారికే పౌరసత్వం ఇచ్చేది ప్రభుత్వం. కొత్త బిల్లుతో అది ఆరేళ్లకు తగ్గింది.