వరద నీటిని వదిలిన భూటాన్... అసోంలో రెడ్ అలర్ట్..
గౌహతి : ఈశాన్య రాష్ట్రం అసోం వరదలతో అతలాకుతమవుతోంది. కుండపోత వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలో జనం అవస్థలు పడుతున్నారు. తాజాగా భూటాన్లోని కురిచ్చు హైడ్రో పవర్ ప్లాంట్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. భారీగా వరద నీరు రానుండటంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న జనాల కష్టాలు మరింత పెరగనున్నాయి.
రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
వరద ప్రభావం బర్పేట జిల్లాపై ఎక్కువగా కనిపించే అవకాశముంది. దీంతో జిల్లా యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బేకి, పహుమరా నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూటాన్లోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 60 మెగావాట్ల కురిచ్చు ప్రాజెక్టు నుంచి అదనపు నీటిని విడుదల చేస్తామని మంగళవారం ప్రకటించింది. తెల్లవారుజామున 3గంటలకు, 5గంటలకు డీజీపీసీ నీటిని విడుదల చేసింది. ఆ నీరు అసోంకు చేరేందుకు మరికొన్ని గంటల సమయం పట్టనుంది.
10మీటర్ల మేర ఎత్తిన డ్యాం గేట్లు
బర్పేట, కోక్రాజర్, బస్కా, చిరాంగ్, బొంగాయ్ గాయ్, కమర్పుప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూటాన్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం డ్యాం గేట్లను 7 నుంచి 10 మీటర్ల మేర ఎత్తారు. దీంతో సెకనుకు 1200క్యూబిక్ మీటర్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. భారీ మొత్తంలో వదలిన వరద నీరు శరవేగంగా దిగువకు దూసుకువస్తోంది.
వరదల కారణంగా 75మంది మృతి
అసోంలో వర్షాలు, వరదల కారణంగా 20జిల్లాల్లోని 34లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 75మంది ప్రాణాలు కోల్పోయారు. 933 సహాయక శిబిరాల్లో 2లక్షల మంది నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. తాజాగా భూటాన్ నుంచి వరద నీరు వస్తుండటంతో ఎన్డీఆర్ఎఫ్తో పాటు రాష్ట్ర బృందాలు అప్రమత్తమయ్యాయి. తనవంతు సాయం అందించేందుకు ఆర్మీ సైతం రంగంలోకి దిగింది.