ముంబై-హైదరాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్... ఎన్హెచ్ఆర్సీఎల్ నుంచి కీలక అప్డేట్...
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(NHSRCL) కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 5వ తేదీన ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో బుల్లెట్ కారిడార్ మార్గానికి సంబంధించిన సర్వే,ఉపరితల మార్గం,అండర్ గ్రౌండ్ మార్గం,సబ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. తద్వారా ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్) నివేదికను రూపొందించనున్నట్లు ఎన్ఎహెచ్ఆర్సీఎల్ ప్రతినిధి సుష్మా గౌర్ వివరాలను వెల్లడించారు.
ఈ కారిడార్కు సంబంధించి నవంబర్ 18 నుంచి టెండర్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. విజయవంతమైన బిడ్డర్కు టెండర్ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. ఇటీవలే మరో ఏడు కారిడార్లలోనూ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి డీపీఆర్లను ఆహ్వానించింది. ఇందులో ఢిల్లీ-అమృత్సర్-చంఢీగఢ్,ఢిల్లీ-వారణాసి,ముంబై-నాగపూర్,ఢిల్లీ-అహ్మదాబాద్ కారిడార్లు ఉన్నాయి. వీటితో పాటే ముంబై-పుణే-హైదరాబాద్ బుల్లెట్ కారిడార్ను అభివృద్ది చేయనుంది. చెన్నై-మైసూర్,వారణాసి-హౌరా మార్గాలకు ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ బుల్లెట్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య దూరం మరింత తగ్గుతుంది. తద్వారా వాణిజ్య,వ్యాపార రంగాలు మరింత అభివృద్ది చెందుతాయి.
2022 నాటికి దేశంలో బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా రైల్వే రూపు రేఖలు మారిపోతాయని చెబుతోంది. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 500కి.మీ రైలు ప్రయాణానికి 8గంటల సమయం పడుతుండగా బుల్లెట్ రైలుతో కేవలం 2గం. 7 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది.