బిగ్ బజార్కు షాక్: క్యారీ బ్యాగుకు డబ్బులు వసూలు చేసినందుకు భారీ జరిమానా
చండీగఢ్: ప్రముఖ రీటెయిలింగ్ సంస్థ బిగ్ బజార్కు చండీగఢ్ వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ కోసం రూ.12 వసూలు చేస్తుండటంతో సీరియస్ అయిన వినియోగదారుల ఫోరం రూ.5 లక్షలు భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని PGIMERలో ఉన్న పేద పేషెంట్ల సంక్షేమ నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన రూ.12ను పిటిషనర్కు చెల్లించడంతో పాటు పరిహారం కింద రూ.100, లిటిగేషన్ కాస్ట్ కింద రూ. 1100 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ను దాఖలు చేసింది చండీగఢ్కు చెందిన నేహా గోయల్.
చండీగఢ్ ఇండస్ట్రియల్ ఏరియా ఫేస్ -1లో ఉన్న బిగ్ బజార్లో కొన్ని వస్తువులు కొన్నట్లు చెప్పిన నేహా గోయల్ వాటి విలువ రూ.1198గా పేర్కొంది. ఇక బిల్లు కట్టేందుకు కౌంటర్ దగ్గరకు వెళ్లగా క్యాషియర్ రూ.12 క్యారీ బ్యాగ్ కోసం బిల్లు వేశాడని ఆమె చెప్పింది. అయితే వస్తువులు కొన్నప్పుడు క్యారీ బ్యాగ్కు బిల్లు వేయడం అక్రమం అని తాను వాదించినట్లు నేహా చెప్పింది. కానీ అతను వినలేదని చెప్పుకొచ్చింది. దీంతో గతేడాది జూలై 1న ఆమె వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే స్టోర్లో క్యారీ బ్యాగ్కు డబ్బులు వసూలు చేయబడతాయని ముందుగానే ఉంచామని దానికి తగ్గట్టుగానే డబ్బులు వసూలు చేశామని బిగ్ బజార్ యాజమాన్యం సమర్థించుకుంది. ఈ క్రమంలోనే నేహా గోయల్ తీసుకున్న వస్తువులకు సంబంధించి క్యారీబ్యాగ్ కావాలని కోరడంతో రూ.12 వసూలు చేసినట్లు బిగ్ బజార్ సమాధానంగా చెప్పింది. అంతేకాదు బిగ్ బజార్ స్టోర్ల పరిసరాల్లో కూడా కస్టమర్లు తమ సొంత బ్యాగులను తీసుకొచ్చుకోవాలని బోర్డులు డిస్ప్లే చేశామని కూడా బిగ్ బజార్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.
అయితే వాదనలు విన్న ఫోరం బిగ్ బజార్ లోపలికి కస్టమర్ల సొంత బ్యాగులను తీసుకురానివ్వరని... దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని క్యారీ బ్యాగులకు సెపరేట్గా బిల్లు వేసి కస్టమర్లను దోచుకుంటోందని అభిప్రాయపడింది. ఒకవేళ బ్యాగులను లోపలికి అనుమతిస్తే తమ క్యారీ బ్యాగులను కొనరని తెలిసే ఇలా వ్యవహరించిందని ఫోరం అభిప్రాయపడింది. ఒక వేళ నిజంగానే వాతావరణ పరిరక్షణ కోసమే ఇదంతా చేస్తుంటే క్యారీ బ్యాగులను ఉచితంగా ఎందుకివ్వరని ఫోరం ప్రశ్నించింది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్లలో క్యారీ బ్యాగులను కస్టమర్లకు ఇచ్చి అదనంగా సొమ్ము చేసుకుంటోందని ఫోరం తన తీర్పులో పేర్కొంటూ రూ. 5 లక్షలు జరిమానా విధించింది.