బలగాల ఉపసంహరణ కీలక మలుపు- చైనా చెప్పినట్లు ఆడం- రాజ్యసభలో రాజ్నాథ్
దాదాపు ఏడాది ప్రతిష్టంభన తర్వాత సరిహద్దుల నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. చైనాతో నిరంతర సంప్రదింపుల తర్వాత కేంద్రం బలగాల ఉపసంహరణకు సిద్దమైంది. అలాగే చైనాను కూడా బలగాలను ఉఫసంహరించాలని కోరింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బలగాలు వెనుదిరుగుతున్నాయి. దీంతో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడనుంది.
భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడఖ్ ప్రాంతంలో ఉన్న ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు ఉపసంహరణకు కీలక ఒప్పందం చేసుకున్నట్లు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ రాజ్యసభలో వెల్లడించాలు. ఈ మేరకు బలగాల ఉపసంహరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందన్నారు. ఈ ఒప్పందంతో భారత్-చైనా సమన్వయంతో ఇరుదేశాల బలగాలను దశలవారీగా ఉఫసంహరిస్తాయని రాజ్నాథ్ పార్లమెంటుకు తెలిపారు.
బలగాల ఉపసంహరణకు ఒప్పందం చేసుకున్నంత మాత్రాన చైనా చెప్పినట్లు వింటున్నట్లు కాదని, ఇరుదేశాల చర్చల ద్వారా మాత్రమే తదుపరి నిర్ణయాలు ఉంటాయని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ పార్లమెంటులో తెలిపారు. చైనా చేసే సహేతుకం కాని డిమాండ్లను తాము ఆమోదించే ప్రశ్నే లేదన్నారు. అలాగే భారత భూభాగంలో అఢుగు కూడా వదులుకోబోమన్నారు. గతంలో పాకిస్తాన్ భారత భూభాగాన్ని అక్రమంగా చైనాకు అప్పగించిందని, దీన్ని తాము ఆమోదించబోమన్నారు. భారీ ఎత్తున భారత భూభాగాన్ని తమదిగా చైనా చెప్పుకుంటోందని, తమకు ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.
లడఖ్లోనూ చైనా ఏకపక్షంగా దూసుకొచ్చిందని, భారత భూభాగం సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందన్నారు. దీన్ని కాపాడుకునేందుకే భారత్ బలగాలు మోహరించిందన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించిందని, దానికి కౌంటర్గానే భారత్ కూడా బలగాలను మోహరించినట్లు రాజ్నాథ్ పేర్కొన్నారు.