వెయ్యి వంటకాలు.. వంద కోట్ల బడ్జెట్ : గాలి కూతురి పెళ్లిలో అదిరిపోయే విందు
బెంగుళూరు : భూతలంలో స్వర్గసీమను తలపించేలా భారీ హంగు ఆర్భాటాలతో కూతురి పెళ్లిని ప్లాన్ చేస్తున్నారు ఓబులాపురం మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి. ఇప్పటికే వెడ్డింగ్ కార్డుతో దేశవ్యాప్తంగా.. అందరి నోళ్లలో నానిన గాలి కూతురి పెళ్లి విషయం రోజుకో కొత్త విషయంతో వార్తల్లో హైలైట్ గా నిలుస్తూనే ఉంది.
ఇక తాజాగా వినవస్తోన్న మాటేంటంటే.. కూతురి పెళ్లి కోసం దాదాపు రూ.250కోట్లను గాలి జనార్ధన్ రెడ్డి ఖర్చు పెట్టబోతున్నారట. ఇక మరింత ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఇందులో దాదాపు రూ.100 కోట్లను వంటలకే ఖర్చు చేయబోతున్నారట. అదిరిపోయే వంటకాలతో ఆహుతులను మైమరపింపజేయడానికి దాదాపు వెయ్యి వంటకాలతో భారీ మెనూని సిద్దం చేస్తున్నారట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వంటకాలన్ని పెళ్లి విందులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ పెళ్లి కోసం కర్ణాటక ప్రజలందరు హాజరుకావాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. అటు సినీ ప్రముఖులు, దేశవ్యాప్త సెలబ్రిటీలతో గాలి కూతురి పెళ్లిలో సందడి నెలకొననుంది. పెళ్లి కొడుకు విషయానికొస్తే.. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రాజీవ్ రెడ్డితో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం జరగనుంది. ఈ వివాహానికి బెంగుళూరు ప్యాలెస్ వేదికగా నిలవనుండగా.. నవంబర్ 16ప వివాహం జరగనుంది.