భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది: కర్ణాటక ఎన్నికల వేళ మోడీకి ఐఎంఎఫ్ జోష్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది.
వేగంగా అభివృద్ధి
2018లో 7.4శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్ బుధవారం ప్రకటించాయి. 2019 నాటికి వృద్ధి రేటు 7.8శాతానికి చేరుతుందని అంచనా వేశాయి.
భారత్ కోలుకుంటోంది..
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి పరిణామాల నుంచి భారత్ కోలుకుందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ రీజినల్ ఎకనామిక్ ఔట్లుక్ వెల్లడించింది. 2017లో వినియోగదారుల ధరల పెరుగుదల 3.7శాతంగా ఉందని, 2018-19నాటికి అది 5శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
వృద్ధిరేటు పుంజుకుంటోంది
కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో బలహీనత, వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అమలు ప్రభావంతో 2017లో భారత వృద్ధి నెమ్మదించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే, ఆ ప్రభావాల నుంచి కోలుకుని, ఈ ఏడాది నుంచి వృద్ధిరేటు క్రమక్రమంగా పుంజుకుంటుందని తెలిపింది.
భారత్ తర్వాత ఆసియా దేశాలు ఇవే
కాగా, భారత్ తర్వాత దక్షిణాసియాలో 2018-19 కాలానికి బంగ్లాదేశ్ 7శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో ఉంటుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇక శ్రీలంక వృద్ధిరేటు 2018లో 4శాతం, 2019లో 4.5 శాతం, నేపాల్ వృద్ధిరేటు 2018లో 5శాతం, 2019లో 4శాతం ఉంటుందని అంచనా వేసింది.