రైతుల్ని గందరగోళపరిచే కుట్ర- వారి అనుమానాలన్నీ తీరుస్తాం- మోడీ వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొ్చ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులను ముట్టడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా నేరుగా రైతులకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని ప్రధాని మోడీ ఇవాళ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ చుట్టూ రైతులను గందరగోళానికి గురిచేసేలా కుట్ర జరుగుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని కచ్లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మోడీ.. రైతుల నిరసనలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీలు రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయని మోడీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే ఇతరులు తమ భూములు ఆక్రమిస్తారని వారు రైతులను భయపెడుతున్నారని మోడీ విమర్శించారు.
రైతులకు మద్దతిస్తున్న విపక్షాలను ఉద్దేశించి మోడీ పలు ఆసక్తికర ప్రశ్నలు కూడా వేశారు. వ్యవసాయ బిల్లులతో హాని జరుగుతుందని ఆరోపిస్తున్న రాజకీయ పార్టీల నేతలు.. వారి నుంచి పాలు సేకరించేందుకు డైరీలు ఒప్పందాలు చేసుకున్నాయా లేదా అని ప్రశ్నించారు. సదరు డెయిరీలు రైతుల నుంచి వాడి పాడిపశువులను ఎత్తుకెళ్లాయా అని ప్రధాని మోడీ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పలు రైతు సంఘాలు, విపక్షాలు ఏళ్ల తరబడి కోరుతున్న సంస్కరణలనే తాము అమలు చేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో వారి అనుమానాలన్నీ తీర్చేందుకు తాము సిద్దమని పునరుద్ఘాటించారు.