పెళ్లి ఖర్చు రూ. 5లక్షలు దాటితే పన్ను మోతే!
బెంగళూరు: ఆడంబర వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రైవేటు బిల్లును గురువారం రాత్రి కర్ణాటక విధానసభలో ప్రవేశపెట్టారు. ఇందులోభాగంగా పెళ్లి వ్యయం రూ. 5 లక్షలు దాటితే విలాస పన్ను విధిస్తారు. వివాహానికి హాజరయ్యే అతిథుల సంఖ్య 1000 మించితే కూడా పన్ను చెల్లించాలి.
కళ్యాణ మంటపం అద్దె రోజు ఒక్కింటికి రూ.యాభై వేలకు మించరాదు. ఎక్కువ బాడుగ వసూలు చేస్తే కల్యాణ మంటపం నిర్వాహకులూ జరిమానా చెల్లించాలి. ఆహ్వానితుల వివరాల్ని రెండు వారాల ముందుగా ప్రభుత్వానికి తెలపాలి.
పెళ్లి పందిరిలోనూ అలంకరణ పరిమితంగా ఉండాలి. వధూవరులకు అతిథులు బహూకరించే కానుకలపైనా పన్ను విధించాలని ఇందులో ప్రతిపాదించారు. నూతన దంపతులు స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలలోగా తమ వివాహాన్ని విధిగా నమోదు చేయించుకోవాలి.
వధూవరులు, వారి తల్లిదండ్రుల పుట్టిన తేదీలు, ఇతర వివరాలన్నింటీని ఇందులో సమగ్రంగా పేర్కొనాలి. కాగా, ఆడంబరంగా చేసుకునే ఈ వివాహాలపై వసూలు చేసిన పన్నును పేద వధూవరుల వివాహాలు చేసేందుకు ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
‘వివాహాల సందర్భంగా ప్రస్తుతం విపరీతంగా ధనం ఖర్చు చేస్తున్నారు. ఆహారమూ చాలా వృథా అవుతోంది. గ్రామీణులు కూడా ఈ తరహా విధానానికి ప్రభావితులు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది' అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జయచంద్ర తెలిపారు.
కాగా, ఆడంబరంగా చేసుకునే వివాహాలపై కర్ణాటక ప్రభుత్వం ఒక వేళ పన్ను విధించినట్లయితే.. దేశంలో ఈ విధంగా పన్నులు వసూలు చేసిన తొలి రాష్ట్రంగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక నిలవనుంది.