బళ్లారి ఉప ఎన్నికలు: నువ్వా నేనా, శ్రీరాములు VS మంత్రి డీకే, సొంత సోదరి, కంచుకోట!
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న మూడు లోక్ సభ ఉప నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాలుగా స్వీకరించాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోటీ కంటే మాజీ ఎంపీ బళ్లారి శ్రీరాములు, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ మధ్య నువ్వానేనా అంటూ పోటీ నెలకొనింది. బళ్లారి ఎంపీ పదవికి శ్రీరాములు రాజీనామా చెయ్యడంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
శ్రీరాములు VS డీకే శివకుమార్
లోక్ సభ ఉప ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత బళ్లారి నియోజక వర్గం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాను రాజీనామా చేసిన నియోజక వర్గంలో తన సోదరి జే. శాంతాను గెలిపించుకోవాలని శ్రీరాములు, తాను ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీఎస్. ఉగ్రప్పను గెలిపించుకోవాలని మంత్రి డీకే. శివకుమార్ పట్టుబడుతున్నారు.
ప్రత్యేక కమిటీ
కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్. ఉగ్రప్ప గెలుపు కోసం మంత్రి డీకే. శివకుమార్ నేతృత్వంలో 52 మందితోప్రత్యేక కమిటీ వేశారు. ఈ కమిటీలో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే మాజీ శాసన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.పి. రవీంద్ర, అనీల్ లాడ్ లకు ఈ కమిటీలో చోటు కల్పించలేదు.
సొంత సోదరి కోసం !
బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరు అనే విషయంలో ఆ పార్టీ నాయకులు తీవ్రకసరత్తులు చేశారు. చివరికి బళ్లారి లోక్ సభ నియోజక వర్గం ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన బి. శ్రీరాములు సోదరి జే. శాంతాను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన జే. శాంతా తన సోదరుడు శ్రీరాములుతో కలిసి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు.
అసమ్మతి నాయకులు
బళ్లారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యాలని బళ్లారి గ్రామీణ జిల్లా ఎమ్మెల్యే బి. నాగేంద్ర తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ వీఎస్. ఉగ్రప్పకు టిక్కెట్ కేటాయించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే నాగ్రేంద్ర అనుచరులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పరువు ప్రతిష్ట
బళ్లారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికలను బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు పరువు ప్రతిష్టగా భావిస్తున్నాయి. బీజేపీకి కంచుకోట అయిన బళ్లారి లోకసభ నియోజక వర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే తనకు ఎంతో పట్టు ఉన్న బళ్లారిలో మళ్లీ తన సోదరిని గెలిపించుకోవాలని శ్రీరాములు పక్కా ప్లాన్ తో ముందుకు వెలుతున్నారు.