మేనల్లుడి పెళ్లికి దావూద్ ఇబ్రహీం ఫ్యామిలీ !
ముంబై: మాఫియా ముఠా నాయకుడు, కరుడుకట్టిన నేరస్తుడు, డీ కంపెనీ వ్యవస్థాపకుడు దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు బుధవారం ముంబైలో జరిగే వివాహ వేడుకలకు హాజరవుతారని పోలీసు వర్గాలు అంటున్నాయి.
నిఖా జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా వేశారు. పాకిస్తాన్ కేంద్రంగా తన మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్న దావూద్ ఇబ్రహీం బుధవారం జరగబోయే తన మేనల్లుడి వివాహాన్ని వీడియో కాలింగ్ సర్వీస్ స్కైప్ ద్వారా చూస్తాడని విశ్వసనీయ సమాచారం.
దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కొడుకు అలిషా పార్కర్ ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకుంటున్నాడు. ముంబై నగరంలోని ఓ మసీదులో జరగనున్న ఈ నిఖాకు కేవలం 15 మంది మాత్రమే హాజరవుతున్నారు.
దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ తదితర బంధువులు ఈ నిఖాకు వస్తారని పోలీసు వర్గాలు అంటున్నాయి. దాడులు, దందాలు, బలవంతపు వసూళ్లుకు పాల్పడిన ఇక్బాల్ కస్కర్ జైలు జీవితం అనుభవించి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు.
దావూద్ ఇబ్రహీం కరాచీ నుంచి స్కైప్ ద్వారా ఈ వివాహ వేడుకలు చూస్తారని అతని కుటుంబ సభ్కులు అంటున్నారు. ఈ పెళ్లి సందర్బంగా నిఖా జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో మకాం వేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
1993లో ముంబై నగరంలో జరిగిన మారణహోమంలో 257 మంది మరణించారు. వీరి మరణానికి, మతఘర్షలు జరగడానికి కారణమైన దావూద్ ఇబ్రహీం తరువాత పాకిస్తాన్ పారిపోయి అక్కడి నుంచి తన చీకటి వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.