బ్యాంకింగ్ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగాలకు ఇచ్చే రుణాలు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రెండోసారి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి మంత్రి సీతారామన్ వివరించారు. బ్యాంకులకు మంచి పాలనా వ్యవస్థ తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆపై ఎగ్గొట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, రుణాలు తీసుకుని ఎగ్గొట్టే కేసులను తగ్గించేందుకు చేపట్టే చర్యలు గురించి ఆమె వివరించారు.
రుణాలను భారీగా రికవరీ చేశాం
ఇక రుణాలు తీసుకుని చెల్లించని వారిపై చర్యలు తీసుకుని రికార్డు స్థాయిలో రికవరీ చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రూ. 7.90 లక్షల కోట్లకు పడిపోయాయని చెప్పారు.అంతకుముందు అవి రూ.8.65 లక్షల కోట్లు ఉండేవని చెప్పారు. ఇక రుణాల రికవరీ కూడా పెరిగిందని చెప్పారు నిర్మలా సీతారామన్. 2018లో రూ.77వేల కోట్లు రుణాలను రికవరీ చేస్తే ప్రస్తుతం రూ.1,71,676 కోట్లు రికవర్ చేశామని వివరించారు.
వైసీపీ, టీడీపీ నేతల మధ్య ముదురుతున్న ట్వీట్ల యుద్ధం: 420 తాతయ్యా అంటూ!
విలీనం అయిన బ్యాంకులు ఇవే
ఇక పలు బ్యాంకులను విలీనం చేసినట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు కెనరాబ్యాంకు సిండికేట్ బ్యాంకులు ఒక్కటి కానుండగా... ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయని ప్రకటించారు. ఇండియన్ బ్యాంక్ అలహాబాదు బ్యాంకులు కూడా విలీనం అవుతాయని తెలిపారు.
ఇక నుంచి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉంటాయి
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకుల విలీనంతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించనున్నాయి. కెనరా సిండికేట్ బ్యాంకుల విలీనంతో నాల్గవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించనున్నాయి. ఇకపై 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉంటాయని చెప్పారు. 2017లో దేశవ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవని గుర్తుచేశారు. ఇక బ్యాంకుల విలీనంతో 82 శాతం లావాదేవీలు ఏడు బ్యాంకుల వద్దే అధికంగా ఉంటాయని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని బలోపేతం చేస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్.