భారీ ఊరట: ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్కు క్లీన్చిట్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్కు ఇరిగేషన్ స్కాంలో భారీ ఊరట లభించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజిత్ పవార్కు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ మేరకు బొంబాయి హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్కు ఏసీబీ అధికారులు ప్రమాణ పత్రం సమర్పించారు.
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు క్లీన్చిట్, ఆరోపణలను కొట్టేసిన బాంబే హైకోర్టు బెంచ్
విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(వీఐడీసీ) పరిధిలోని 12 ప్రాజెక్టులకు సంబంధించి అజిత్ పవార్ ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని ప్రమాణపత్రంలో ఏసీబీ పేర్కొంది. ఏసీబీఐ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ ఈ మేరకు గురువారం ప్రమాణపత్రం సమర్పించారని, 12 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి క్లీన్చిట్ ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారని ఏసీబీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన దర్యాప్తులో ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తేలిందని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. కాగా, అంతకుముందు ఇదే బెంచ్కు ఏసీబీ సమర్పించిన ప్రమాణపత్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిలో అజిత్ పవార్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రస్తావించడం గమనార్హం.
కాగా, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) ప్రభుత్వం ప్రమాణస్వీకారానిక ఒక్క రోజు ముందు అంటే నవంబర్ 27న ప్రమాణపత్రం దాఖలు చేసింది. 1999-2009 మధ్య కాంగ్రెస్-ఎన్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అజిత్ పవార్ జలవనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశారు. వీఐడీసీ ఛైర్మన్గానూ వ్యవహరించారు. ఆ సమయంలోనే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అజిత్ పవార్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బారామతి ఎమ్మెల్యేగా గెలుపొందారు.