2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
2019లో దేశంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణంలో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో విద్యార్ధులు నిరసనలు చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హింసలో పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో జేఎన్.యూ విద్యార్ధి నేత షర్జీల్ ఇమామ్ తో పాటు విద్యార్ధి సంఘాల కార్యకర్త ఆసిఫ్ తన్హాలపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం నుంచి వీరికి ఇవాళ విముక్తి లభించింది.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో జేఎన్యూ విద్యార్థి షర్జీల్ ఇమామ్, విద్యార్థి కార్యకర్త ఆసిఫ్ ఇక్బాల్ తన్హాపై పోలీసులు నమోదు చేసిన అభియోగాల నుంచి ఢిల్లీ కోర్టు ఇవాళ విముక్తి కల్పించింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న సాకేత్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి అరుల్ వర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా ఇద్దరికీ గతంలో బెయిల్ మంజూరైంది. అయితే 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో షర్జీల్ కఠినమైన ఉపా చట్టం జైలులోనే ఉన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పోలీసులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత చెలరేగిన మత హింసకు సంబంధించి అల్లర్లు సహా ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం ఇమామ్ డిసెంబర్ 13, 2019 న జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో డిసెంబర్ 16, 2019న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని ఆరోపించారు. వీటిలోఇమామ్ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి విడదీస్తానని బెదిరించాడని తెలిపారు.అయితే ఈ ఆరోపణలు రుజువు కాలేదు.