Union Budget 2023 : వేతనజీవులకు భారీ ఊరట- 7 లక్షల వరకూ పన్ను లేదు- దాటితే 3 లక్షలే..
కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది. ఏడాదికి ప్రస్తుతం ఉన్న 5 రూపాయల పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షలకు పెంచింది.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల వేళ వేతనజీవులకు భారీ ఊరటనిచ్చారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మదింపుకు సంబంధించి ఐదు ముఖ్యమైన మార్పుల్ని ఇవాళ ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయల పన్ను మినహాయంపు పరిమితిని 7 లక్షల రూపాయలకు పెంచేశారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదికి 2 లక్షల రూపాయల వరకూ పన్ను ప్రయోజనం లభించబోతోంది.
అలాగే మధ్యతరగతి వేతన జీవులకు మరో ఊరటనిస్తూ 7 లక్షలు దాటితే వివిధ స్లాబ్ ల్లో పన్ను లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు. వ్యక్తిగత పన్ను 7 లక్షలు దాటి తర్వాత 3 లక్షల వరకే పన్ను మినహాయింపు ఉంటుందని, ఆ తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ వేతనం ఉంటే 5 శాతం, రూ. 6 నుంచి రూ.9 లక్షలు ఉంటే 10 శాతం, అలాగే రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వేతనం ఉంటే 15 శాతం పన్ను విధిస్తామని నిర్మల బడ్జెట్లో ప్రకటించారు. అటు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. అలాగే రూ.15 లక్షలు దాటితే మాత్రం 30 శాతం పన్ను విధించనున్నారు.
మరోవైపు ఆదాయపు పన్ను స్టాండర్డ్ రిబేట్ పరిమితిని కూడా రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ బడ్జెట్ లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు ఎన్నికల బడ్జెట్ గా చెబుతున్న ఈసారి పద్దులో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులపై భారీ ప్రభావం చూపబోతోంది. వేతన జీవుల్ని తన గత బడ్జెట్లలో పెద్దగా ఆకట్టుకుని నిర్మలా సీతారామన్ ఈసారి మాత్రం వారికి భారీ ప్రయోజనం అందించారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ ఏడాది జరిగే 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.