ముంబైలోని ధారావికి బిగ్ రిలీఫ్ ... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో తొలిసారిగా జీరో కొత్త కేసులు
కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభిస్తున్న నాటినుండి ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడ అయిన ధారావి కరోనా మహమ్మారి దెబ్బకు గడగడలాడింది. ధారావి లో విపరీతంగా కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ కరోనా ను కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. మొత్తానికి అసలు కరోనా కంట్రోల్ అవుతుందా కాదా అనుకున్న మురికివాడలో ఎవరూ ఊహించని విధంగా కరోనా అదుపులోకి వచ్చింది.
ముంబై ధారావిలో శుక్రవారం కరోనా కొత్త కేసులు లేవు
ప్రపంచంలోని ప్రమాదకరమైన కోవిడ్ -19 హాట్స్పాట్లలో ఒకటైన ముంబై ధారావిలో శుక్రవారం రోజు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ధారవి వాసులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఏప్రిల్ 1 నుండి మొదటిసారిగా, ఈ ప్రాంతంలో శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ధారావిలో కరోనా కట్టడిలో ఆరోగ్య కార్యకర్తలు, పరిశోధనా ఔత్సాహికులు కీలక పాత్ర పోషించారు. ఇంటింటికీ శానిటైజర్ లను ఏర్పాటు చేయడమే కాకుండా, నిరంతరం పరీక్షలు నిర్వహించి వైరస్ బారిన పడిన వారిని వెంటనే ఐసోలేషన్ కు తరలించారు .
ధారావి కరోనా కంట్రోల్ లో భేష్ ... యాక్టివ్ కేసులు కేవలం 12
అధికారులు యుద్ధ ప్రాతిపదికన నిరంతరాయంగా కృతనిశ్చయంతో పనిచేసిన కారణంగానే ఇక్కడ కరోనా అదుపులోకి వచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య కేవలం 12 . ధారావిలో ఇప్పటివరకు మొత్తం 3788 కేసులు నమోదయ్యాయి, అందులో 3464 మంది డిశ్చార్జ్ అయ్యారు.2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావి 6.5 లక్షలకు పైగా జనాభా కలిగిన ఆసియాలో అతిపెద్ద మురికివాడగా పరిగణించబడుతుంది. మొట్టమొదటి కోవిడ్ -19 కేసు ఏప్రిల్ 1 న ధారావిలో నమోదైంది. ఆ తర్వాత విపరీతంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఆరోగ్య కార్యకర్తలకు బాగా సహకరించిన ధారావి వాసులు .. డబ్ల్యూహెచ్ఓ ప్రశంస
ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నందున అప్పట్లో కేసుల సంఖ్య భారీగా బయటపడటంపై ఆందోళన వ్యక్తం అయ్యింది . ఏదేమైనా, కోవిడ్ -19 ఆంక్షలు, సంరక్షణను క్రమబద్ధంగా అమలు చేయడానికి ధారావి నివాసితులు ఆరోగ్య అధికారులతో సహకరించారని , దాని ఫలితమే ప్రస్తుతం ధారావిలో జీరో కేసులని తెలుస్తోంది . జూలైలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధారావి నమూనాను ప్రశంసించింది. ధారావిలో కేసుల తీవ్రత ఉన్నప్పటికీ వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ తెలిపారు.
మురికివాడలో కరోనా కంట్రోల్ కావటంలో అందరి కృషి .. ఊపిరి పీల్చుకున్న ధారావి వాసులు
ధారావిలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడం కోసం ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరించి సక్సెస్ అయినట్లుగా తెలుస్తుంది. కరోనా క్లస్టర్ నుండి కంటైన్ మెంట్ మోడల్ గా మారడం ద్వారా విజయం సాధించి ప్రపంచ ప్రశంసలు అందుకుంటోంది ధారావి. మొత్తానికి ఒక మురికివాడలో కరోనా కంట్రోల్ కావటానికి ఆరోగ్య కార్యకర్తల పనితీరు ఎంతగా ఉందో అంతగా అక్కడి ప్రజల సహకారం , కరోనాపై వారిలో అవగాహన కూడా అంతే ఉండటం ధారావి అత్యధిక కేసుల నుండి జీరోకి రావటానికి కారణం .