మహారాష్ట్ర తర్వాత మరో షాక్.. జార్ఖండ్లో ఫలించని మోదీ-షా చాణక్యం, అపజయానికి కారణం..
Recommended Video
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ కూటమి దూసుకుపోతున్నది. చిన్న పార్టీల మద్దతు అవసరం లేకుండానే కూటమి మెజార్టీ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నది. చివరిదాకా ట్రెండ్ ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ కూటమికి సీట్ల సంఖ్య 50 దాటినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఫలితాల సరళితో.. బీజేపీ రెండోసారి అధికారం చేపట్టబోవడంలేదనేది స్పష్టంగా తెలిసిపోయింది. దీన్నిబట్టి జార్ఖండ్ లో ప్రధాని మోదీ, అమిత్ షాల చాణక్యమంత్రం ఫెయిలైనట్లు అర్థమవుతోంది.
జార్ఖండ్ చరిత్రను తిరగరాసే బాహుబలి ఎవరు ?: 19 ఏళ్లలో ఆరు మంది సిట్టింగ్ సీఎంలకు నో చాన్స్, బళ్లాల!
కాలికి బలపం కట్టుకుని తిరిగినా..
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ లో గెలుపు కోసం బీజేపీ మొదటి నుంచీ కసితో పనిచేసింది. మొత్తం ఐదు ఫేజ్ లలో జరిగిన ఎన్నికల్లో.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎక్కువ సభల్లో పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేసింది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా వీలు కల్పించుకుని మీరీ ప్రధాని మోదీ, అమిత్ షాలు జార్ఖండ్ క్యాంపెయిన్ కు కేటాయించారు.
స్టార్ క్యాంపెయినర్లు కూడా..
జార్ఖండ్లో అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ కాకుండా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులను స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దిగారు. మిగతా అన్ని పార్టీల కంటే ఘనంగా ప్రచారం నిర్వహించనప్పటికీ ఫలితాల్లో బీజేపీ వెనుకబడిపోవడం గమనార్హం.
బీజేపీని దెబ్బతీసిన అంశాలివేనా?
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా పదే పదే జాతీయ అంశాలను ప్రస్తావించారు. వారి ప్రసంగాలు చాలా వరకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ చట్టం చుట్టూ తిరిగాయి. ఆర్టికల్ 370 లాంటి ఇతర జాతీయ అంశాలనూ మళ్లీ మళ్లీ మాట్లాడారు. పూర్తిగా జార్ఖండ్ కు సంబంధించిన అంశాలను నామమాత్రంగానే ప్రస్తావించారు తప్ప.. జనంలోకి వెళ్లేలా స్పష్టమైన పిలుపును ఈ ఇద్దరు నేతలూ ఇవ్వలేకపోయారు.
జార్ఖండ్ సర్కార్పై వ్యతిరేకత
పైగా, రఘుబర్ దాస్ సర్కారు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. మోడీ, షా మాత్రం ఆయన పాలనను మెచ్చుకోవడం ఓటర్లకు మింగుడు పడనట్లు తెలుస్తున్నది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను సెపరేట్ గా చూస్తున్న ఓటర్లు.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే జాతీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా స్థానిక విషయాల ఆధారంగానే ఓట్లు వేశారు. వ్యతిరేకతను గుర్తించకపోవడం, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోవడమే తాజా ఫలితాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర తర్వాత మరో షాక్..
లోక్ సభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి భారీ మెజార్టీ సాధించిన బీజేపీకి.. ఆరు నెలలు తిరక్కముందే జార్ఖండ్ ఫలితాల రూపంలో రెండో పెద్ద షాక్ తగిలినిట్లయింది. రెండు నెలల కిందట జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. కూటమిలోని శివసేన పార్టీని వదులుకుని చివరికి అధికారానికే దూరం కావాల్సి వచ్చింది. పకడ్బందీగా స్ట్రాటజీలు రూపొందించి, వాటిని అమలు చేయడంలో రెండు చోట్లా బీజేపీ ఫెయిలైనట్లు అర్థమవుతోంది.